రికార్డుల జోరుకు బ్రేక్
ముంబై : రికార్డుల జోరుకు బ్రేక్ పడింది. దలాల్స్ట్రీట్ నెమ్మదించింది. అస్థిరంగా, ఒడిదుడుకుల్లో నడిచిన శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్లు, చివరికి నష్టాలతో ముగిశాయి. దీంతో వరుసగా నాలుగు రోజుల నుంచి అలుపు సొలుపు లేకుండా పరిగెడుతున్న స్టాక్ మార్కెట్లకు విరామం లభించింది. సెన్సెక్స్ 85 పాయింట్ల నష్టంలో 38,251 వద్ద ముగియగా.. నిఫ్టీ 26 పాయింట్ల నష్టంలో 11,557 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఐటీ, ఆటో స్టాక్స్లో నెలకొన్న ఒత్తిడిని మార్కెట్లను నష్టాల బాట పట్టించాయి.
నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 0.7 శాతం నష్టపోయింది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్ 0.6 శాతం నుంచి 1.9 శాతం తగ్గింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ సుమారు 2 శాతం మేర పెరిగింది. అదేవిధంగా గ్లోబల్ మార్కెట్ నుంచి వస్తున్న బలహీనమైన సంకేతాలు కూడా సెంటిమెంట్పై దెబ్బకొట్టాయి. కొత్తగా మరోసారి అమెరికా-చైనాల మధ్య టారిఫ్ వార్ నెలకొంది. ఇది ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపింది. టాప్ గెయినర్లుగా వేదంత, ఓఎన్జీసీ లాభాలు పండించగా.. యస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టైటాన్ ఎక్కువగా నష్టపోయాయి.