స్టాక్ మార్కెట్లో జోరుగా దేశీ పెట్టుబడులు
ఈ ఏడాది ఇప్పటివరకూ 1,000 కోట్ల డాలర్లు ఎఫ్పీఐల ఉపసంహరణ 28 కోట్ల డాలర్లు మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ వెల్లడి
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) జోరుగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ డీఐఐలు 1,000 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సంస్థ తెలిపింది. ఇదే కాలంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు 28 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. స్టాక్ మార్కెట్లో దేశీ, విదేశీ పెట్టుబడులు సరళి గురించి ఇంకా ఈ సంస్థ ఏం చెప్పిందంటే..,
గత ఏడాది ఇదే కాలానికి విదేశీ ఇన్వెస్టర్లు 777 కోట్ల డాలర్లు, డీఐఐలు 1,400 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారు. విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది జనవరిలో 220 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారు.ఫిబ్రవరిలో మాత్రం 180 కోట్ల డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి తీసుకున్నారు. మళ్లీ మార్చిలో 180 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ఏప్రిల్–జూన్ కాలానికి 300 కోట్ల డాలర్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. జూలైలో 33 కోట్లు, ఆగస్టులో ఇప్పటివరకూ 24 కోట్ల డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. కాగా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి ఈ ఏడాది ప్రతికూలంగా ఆరంభమైంది.ఈ ఏడాది జనవరిలో డీఐఐలు 11 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ డీఐఐఈ పెట్టబడులు కొనసాగుతూనే ఉన్నాయి. వృద్ధి, కంపెనీల క్యూ1 ఫలితాలు మెరుగ్గా ఉండటం వంటి సానుకూలాంశాలు కొనసాగితేనే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా కొనసాగుతాయి.