గుజరాత్ షాక్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గుజరాత్ ఎన్నికల ఫలితాల సరళికి అనుగుణంగా స్పందిస్తున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో కొన్నసాగుతున్న ఓట్ల లెక్కింపు పోరులో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఆరంభంలో కీలక సూచీ సెన్సెక్స్ 765 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ కూడా 10వేల మార్క్ను కూడా కోల్పోతుందా అన్న ఆందోళన రేపింది. దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఆశలు వదిలేసుకున్నప్పటికీ, గుజరాత్లో అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడంతో మార్కెట్లు ఢమాల్మన్నాయి. ముఖ్యంగా గుజరాత్ ఆధారిత షేర్లు పతనమవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 675 పాయింట్ల నష్టంతో 32, 787వద్ద, నిఫ్టీ 208 పాయింట్ల నష్టంతో 10,125 వద్ద కొనసాగుతోంది.
అటు ఇన్వెస్టర్లు, ఇటు ట్రేడర్లు ఒక్కసారిగా అమ్మకాలకు దిగారు. రియల్టీ, బ్యాంక్ నిఫ్టీ, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా సెక్టార్లు షేర్లు నేలచూపులతో కదులుతున్నాయి. ప్రధానంగా అదానీ పోర్ట్స్, భారతీ, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్, ఆర్ఐఎల్, హెచ్పీసీఎల్, టాటా మోటార్స్, వేదాంతా, యూపీఎల్, కోల్ ఇండియా భారీగా నష్టపోతున్నాయి.