ఆదిభట్లలో రియల్‌ అభివృద్ధి!

Boom with IT and Aero Space Companies - Sakshi

ఐటీ, ఎయిరో స్పేస్‌ కంపెనీలతో బూమ్‌

ఓపెన్‌ ప్లాట్లకు భలే డిమాండ్‌; విల్లాలు, అపార్ట్‌మెంట్లకూ గిరాకీ

ఐదేళ్లలో హైటెక్‌ సిటీని మించిపోతుందంటున్న డెవలపర్లు

ఐటీ కంపెనీలున్న చోట స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతుందన్నది తెలిసిన సంగతే! మరి, ఐటీ సంస్థలతో పాటూ ఎయిరో స్పేస్‌ కంపెనీలూ కొలువుదీరితే? భవిష్యత్తు రియల్‌ అభివృద్ధి ఢోకా ఉంటుందన్నట్టేగా! ఈ ఉపోద్ఘాతమంతా ఆదిభట్ల గురించే! స్థానిక అభివృద్ధి అవకాశాలను అంచనా వేస్తున్న స్థిరాస్తి నిపుణులు ఆదిభట్ల ప్రాంతం వచ్చే ఐదేళ్లలో హైటెక్‌ సిటీని మరిపించేలా రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌ :  ఆదిభట్లలో రియల్‌ పరుగులు ప్రారంభమైంది టీసీఎస్‌ ప్రారంభంతోనే! ఆ తర్వాత కాగ్నిజెంట్, కన్వెర్జిస్‌ వంటి సంస్థలూ రావటంతో అసలైన బూమ్‌ మొదలైంది. మరోవైపు దేశంలోనే తొలి ఎయిర్‌స్పేస్‌ సెజ్‌కు ఆదిభట్ల ఎంపిక కావటం, ఔటర్‌ రింగ్‌ రోడ్డూ అందుబాటులోకి రావటంతో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. ఇది ఆదిభట్లతోనే ఆగిపోకుండా ఇబ్రహీంపట్నం, యంజాల్, మన్నెగూడ క్రాస్‌ రోడ్, బొంగ్లూరు, కొంగరకలాన్, మంగల్‌పల్లి ప్రాంతాలకూ విస్తరించింది. 2002లో ఎకరం రూ.6 లక్షలు పలికిన ఆదిభట్లలో ఇప్పుడు రూ.3 కోట్ల పైమాటే. ఇది చాలదూ.. ఆదిభట్ల స్థిరాస్తి వ్యాపార అభివృద్ధి గురించి చెప్పడానికి!

వైమానిక జోష్‌..
ఇటీవల కాలంలో ఆదిభట్ల ప్రాంతంపై ఐటీ, వైమానిక తయారీ కంపెనీలు, డిఫెన్స్‌ కంపెనీలు దృష్టిసారించాయి. ఇప్పటికే స్థానిక ఎయిర్‌స్పేస్‌ సెజ్‌లో టాటా అడ్వాన్స్‌›్డ సిస్టమ్, టాటా లాక్హీడ్‌ మార్టిన్, టాటా సికోర్‌ స్కై, సమూహా, డెస్మీ ఇండియా వంటి సంస్థలున్నాయి. వీటిల్లో సుమారు 30 వేల మంది ఉద్యోగులుంటారని సమాచారం. గతంలో బీడీఎల్, ఆక్టోపస్, బెల్, ఎన్‌ఎస్‌జీ, సీఆర్‌పీఎఫ్‌ వంటి కేంద్ర సంస్థల విస్తరణ, కార్యకలాపాల కోసం ఇబ్రహీంపట్నంలో స్థలాలను కేటాయించారు.

భవిష్యత్తులో ఇవి కూడా కార్యరూపం దాల్చితే ఇబ్రహీంపట్నం ముఖచిత్రం మారుతుందనడంలో సందేహమక్కర్లేదు. అంతేకాకుండా గత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్‌ ప్రాజెక్ట్‌లో.. క్లస్టర్‌–3లోని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ అథారిటీలో ఆదిభట్ల, మహేశ్వరం, రావిరాల, మామిడిపల్లి ప్రాంతాలున్నాయి. ఇవి 79.2 చ.కి.మీ. పరిధిలో విస్తరించి ఉంది. దీంతో ఐటీ కంపెనీలూ ఆయా ప్రాంతాలపై దృష్టిసారిస్తున్నాయి.

70 శాతం ఓపెన్‌ ప్లాట్లే..
ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, బొంగ్లూరు వంటి ప్రాంతాల్లో జేబీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, సీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, మెట్రో సిటీ డెవలపర్స్, శ్రీ శ్రీ హోమ్స్, శ్రీసాయి బాలాజీ ఎస్టేట్స్‌ వంటి సంస్థలు ఓపెన్‌ లే అవుట్లు, విల్లాలు, అపార్ట్‌మెంట్లున్నాయి. అయితే ఆయా ప్రాంతాల్లో 70 శాతం ఓపెన్‌ ప్లాట్లే ఉంటాయని, మిగిలిన 30 శాతంలో విల్లాలు, అపార్ట్‌మెంట్లు ఉంటాయని జేబీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ ఎస్‌ ప్రతాప్‌ రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు.

ఇక్కడ ధర చ.అ.కు రూ.2,500ల నుంచి ఉన్నాయి. ఫ్లాట్ల కనీస చ.అ.లు 1,200ల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సందడితో ఈ ప్రాంతం హైటెక్‌ సిటీని తలపిస్తుందని సీఎంఆర్‌ ఇన్‌ఫ్రా సీఎండీ సీహెచ్‌ మురళీధర్‌ రెడ్డి తెలిపారు. దీంతో స్థానిక కొనుగోలుదారులతో పాటూ ప్రవాసులు, విదేశీ ఇన్వెస్టర్లూ ఆసక్తి చూపిస్తున్నారు. సమీప భవిష్యత్తులో భారీ నివాస, వాణిజ్య సముదాయాలు నిర్మించేందుకు సుమారు ఐదారు బడా నిర్మాణ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.  

విద్య, వైద్య, వినోద కేంద్రాలూ..
ఆదిభట్ల నుంచి బొంగ్లూరు ఔటర్‌ రింగ్‌ రోడ్డు జంక్షన్‌ మీదుగా 15 నిమిషాల ప్రయాణ వ్యవధిలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అలాగే 13 కి.మీ. పరిధిలో ఎల్బీనగర్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో రైలు స్టేషన్‌ ఉండటం ఈ ప్రాంతానికి కలిసొచ్చే అంశాలు.

ఇక్కడి విద్య, వైద్య, వినోద కేంద్రాలను పరిశీలిస్తే.. నాగార్జున్‌ సాగర్‌ రోడ్డు ముందు నుంచి కూడా ప్రశాంత మైన, ఆరోగ్య వాతావరణానికి పేరొందిందని జేబీ ఇన్‌ఫ్రా పార్టనర్‌ గోవర్ధన్‌ రెడ్డి తెలిపారు. సీవీఆర్, గురునానక్, భారతి, శ్రీఇందు వంటి ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాలలు, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్, శ్లోకా వంటి అంతర్జాతీయ పాఠశాలలూ ఉన్నాయి. ఆర్డీవో, ఆర్‌టీఏ, కలెక్టరేట్‌ కార్యాలయాలున్నాయి. కృష్ణా త్రాగు నీరు, నిరంతర విద్యుత్‌ సరఫరా, విస్తారమైన భూగర్భ నీళ్లూ ఉన్నాయిక్కడ.

సీఎంఆర్‌ రిచ్‌ మిడోస్‌
బొంగ్లూరులో విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలో 9.25 ఎకరాలను అభివృద్ధి చేస్తోంది సీఎంఆర్‌ ఇన్‌ఫ్రా. రిచ్‌ మిడోస్‌ పేరిట హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన ఈ వెంచర్‌లో మొత్తం 101 ప్లాట్లుంటాయని కంపెనీ సీఎండీ సీహెచ్‌ మురళీధర్‌ రెడ్డి తెలిపారు. 220 గజాల ప్లాట్లున్నాయి. ఇప్పటికే 80 శాతం విక్రయాలు పూర్తయ్యాయి. ఇందులో భూగర్భ డ్రైనేజీ, విద్యుత్‌ వ్యవస్థ, బీటీ రోడ్లు, ప్లాంటేషన్, ఓవర్‌ వాటర్‌ హెడ్‌ట్యాంక్, ప్రహారీ గోడ, ముఖద్వారం వంటి గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఉండే అన్ని రకాల వసతులుంటాయి.

పెద్ద అంబర్‌పేటలో 2 ఎకరాల్లో సీఎంఆర్‌ హోమ్స్‌ పేరిట మరో ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. ఇందులో 167 గజాల్లో మొత్తం 25 ప్లాట్లుంటాయి. ఫిబ్రవరిలో ఆదిభట్ల నుంచి 5 కి.మీ. దూరంలోని మంగల్‌పల్లిలో 10 ఎకరాల్లో మరో వెంచర్‌ను ప్రారంభించనున్నాం. ఇందులో 150 గజాల్లో మొత్తం 140 ప్లాట్లుంటాయి. గతంలో హయత్‌నగర్‌లో జీహెచ్‌ఎంసీ అనుమతి పొందిన 10 ఎకరాల వెంచర్‌ను పూర్తి చేసింది కూడా.

540 ఎకరాల్లో సెరైన్‌ సిటీ!
అభివృద్ధికి ఆస్కారమున్న శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని వెంచర్లకు శ్రీకారం చుట్టే జేబీ ఇన్‌ఫ్రా.. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో భారీ లే అవుట్‌ను చేస్తోంది. దశాబ్దన్నర కాలంలో 900 ఎకరాల్లో 9 ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన ఈ సంస్థ నాగార్జున సాగర్‌ రోడ్డులోనే 500 ఎకరాలను అభివృద్ధి చేసింది. తాజాగా ఇదే రోడ్డులో గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలను ఆనుకొని 540 ఎకరాల్లో సెరైన్‌ సిటీ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ పార్టనర్‌ ఎస్‌ ప్రతాప్‌ రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు.

మొత్తం నాలుగు ఫేజుల్లో 1,800 ఓపెన్‌ ప్లాట్లు, 600 విల్లాలుంటాయి. ఇప్పటికే ఫేజ్‌–1, 2ల్లో 115 ఎకరాల్లో 1,100 ప్లాట్లను పూర్తి చేశాం. ప్రస్తుతం ఫేజ్‌–3, 4 అమ్మకాలు జరుగుతున్నాయి. 95 ఎకరాల్లోని ఫేజ్‌–3లో గజం ధర రూ.7,500. ఫేజ్‌–4లో 55 ఎకరాల్లో సుమారు 600ల డూప్లెక్స్‌ విల్లాలుంటాయి. 200 గజాల్లో 2,500 చ.అ.ల్లోని విల్లా ధర రూ.65 లక్షలు.

సెరైన్‌ సిటీలో అంతర్జాతీయ వసతులను కల్పిస్తున్నాం. భూగర్భ విద్యుత్, మురుగు నీటి వ్యవస్థ, 80 అడుగుల రోడ్లు, ప్లాంటేషన్, 5 ఎకరాల్లో క్లబ్‌ హౌజ్, ఆట మైదానాలు, 10 ఎకరాల్లో ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేస్తాం. ఫేజ్‌–1లో గజం రూ.5 వేలకు విక్రయించాం. ఇప్పుడది రూ.7,500 దాటింది. రెండేళ్లలో ధర 60 శాతం పెరిగిందని త్వరలోనే ధరలు పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. జేబీ ఇన్‌ఫ్రాకు ప్రతాప్‌ రెడ్డితో పాటూ ఎం గోవర్ధన్‌ రెడ్డి, బీ మనోహర్‌ రెడ్డి, ఏ జగన్‌ రెడ్డిలు కూడా పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top