బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాం
వీటితో 6,000 ఉద్యోగాలు వస్తాయి
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను సాధించామని, వీటితో తమ దేశంలో ఆరు వేల మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పాటవుతాయని చెప్పారు. భారత వ్యాపార సమూహం సంపూర్ణ విశ్వాసానికి ఇది నిదర్శనమన్నారు. కెనడాలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఎన్నో కంపెనీలు ఆసక్తితో ఉన్నాయని చెప్పారు. సీఐఐ గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ట్రూడో పాల్గొని మాట్లాడారు.
వ్యాపార నిర్వహణకు కెనడా ఉత్తమ ప్రదేశంగా పేర్కొన్నారు. భారత్, కెనడా తమ స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షించారు. అందుకే తాను భారత్లో పర్యటిస్తున్నట్టు చెప్పారు. 400కుపైగా కెనడా కంపెనీలు భారత్లో పనిచేస్తున్నాయని, రానున్న కాలంలో ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందనడంలో సందేహం లేదన్నారు.
‘‘వైవిధ్యం అనేది ప్రగతికి కీలకం. ఆర్థికాభివృద్ధి అన్నది మన సమాజంలోని ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చాలి. మన మధ్య వాణిజ్యం, పెట్టుబడులు ఉండాలి. వీటితో ప్రయోజనం పొందొచ్చు’’అని ట్రూడో చెప్పారు. కోల్డ్ చెయిన్, రిఫ్రిజిరేషన్లో రెండు దేశాల మధ్య విస్తృత సహకారానికి ఎన్నో అవకాశాలున్నాయని ఇదే సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి హరిసిమ్రత్కౌర్ బాదల్ అన్నారు.