ఆరంభం అదిరింది...కానీ నష్టాలే..
ఇంట్రాడేలో ఆల్టైమ్ హైకి స్టాక్సూచీలు
ఆర్బీఐ ఆంక్షలతో బ్యాంక్ షేర్లకు నష్టాలు
లాభాల స్వీకరణతో స్టాక్ సూచీల పతనం
59 పాయింట్ల పతనంతో 33,777కు సెన్సెక్స్
19 పాయింట్ల నష్టంతో 10,444కు నిఫ్టీ
నాలుగు రోజుల వరుస లాభాల అనంతరం స్టాక్ మార్కెట్ బుధవారం నష్టపోయింది. ఇంట్రాడేలో స్టాక్ సూచీలు జీవిత కాల గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. అయితే మొండిబకాయిల విషయమై ఆర్బీఐ ఝుళిపించిన కొరడాతో బ్యాంక్ షేర్లు కుదేలవడం, లాభాల స్వీకరణతో చివరకు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 59 పాయింట్ల నష్టంతో 33,777 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 10,444 పాయింట్ల వద్ద ముగిశాయి.
ప్రారంభంలోనే కొత్త రికార్డ్లు..
స్టాక్ సూచీలు ట్రేడింగ్ ప్రారంభంలోనే కొత్త రికార్డ్లు నెలకొల్పాయి. 92 పాయింట్ల లాభంతో 33, 929 పాయింట్ల వద్ద ఆరంభమైన సెన్సెక్స్ కొద్ది సేపటికే 120 పాయింట్ల లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, 33,956 పాయింట్లను తాకింది. ఇక నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 10,494 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది.
మారుతీ సుజుకీ @ 10,000
గత కొన్ని రోజులుగా దూసుకుపోతున్న మారుతీ సుజుకీ జోరుకు బుధవారం కళ్లెం పడింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.10,000 చేరిన తర్వాత ఈ షేర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. 2003లో రూ. 125 ధరతో స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసిన మారుతీ సుజుకీ 14 ఏళ్లలో దాదాపు 8,000 శాతం లాభపడి బుధవారం రూ.10,000 మైలురాయిని తాకింది. చివరకు 0.6 శాతం నష్టంతో రూ.9,738 వద్ద ముగిసింది.
దూసుకుపోయిన ఆర్కామ్..
స్టాక్మార్కెట్ లాభనష్టాల మధ్య ఊగిసలాడినప్పటికీ, అనిల్ ధీరుబాయ్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేర్ జోరుగా పెరిగింది. ఈ కంపెనీకి వ్యతిరేకంగా దాఖలైన దివాళా పిటీషన్ల విచారణను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) వచ్చే నెలకు వాయిదా వేసిందన్న వార్తల కారణంగా బీఎస్ఈలో ఆర్కామ్ షేర్ ఇంట్రాడేలో 45 శాతానికి పైగా పెరిగింది. చివరకు 35 శాతం లాభంతో రూ.17.27 వద్ద ముగిసింది. అనిల్ అంబానీ గ్రూప్కు చెందిన ఇతర షేర్లు రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ 11 శాతం, రిలయన్స్ క్యాపిటల్ 7 శాతం, రిలయన్స్ పవర్ 7 శాతం, రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ 1 శాతం చొప్పున పెరిగాయి.