ఎయిరిండియా ‘సలహాదారు’ రేసులో 7 సంస్థలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థల్లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి సంబంధించి సలహాదారుగా వ్యవహరించేందుకు ఏడు సంస్థలు పోటీపడుతున్నాయి. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కేపీఎంజీ, బీఎన్పీ పారిబా, రోత్షైల్డ్ ఇండియా, ఎర్నస్ట్ అండ్ యంగ్, గ్రాంట్ థార్న్టన్, ఎడెల్వీస్ ఈ జాబితాలో ఉన్నాయి.
మరోవైపు లీగల్ సేవలందించేందుకు కూడా ఏడు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో హమ్మురాబి అండ్ సోలమన్ పార్ట్నర్స్, సిరిల్ అమర్చంద్ మంగళ్దాస్, క్రాఫోర్డ్ బేలీ అండ్ కో, శార్దూల్ అమర్చంద్ మంగళ్దాస్, లూథ్రా అండ్ లూథ్రా, ఏఎల్ఎంటీ లీగల్, ట్రైలీగల్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం (దీపం) వెబ్సైట్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
ఈ సంస్థలు శుక్రవారం దీపం విభాగానికి తమ ప్రతిపాదనలు సమర్పిస్తాయి. ఎయిరిండియాకి దాదాపు రూ. 50,000 కోట్ల రుణభారం ఉంది. ఈ నేపథ్యంలో ఎయిరిండియాలోనూ దాని అనుబంధ సంస్థల్లోనూ వ్యూహాత్మక వాటాల విక్రయం జరపాలని భావిస్తున్న కేంద్రం... దీనిపై తగు సలహాలిచ్చేందుకు రెండు అడ్వైజరీ సంస్థలు, ఒక లీగల్ అడ్వైజర్ కావాలంటూ గత నెలలో దరఖాస్తులు ఆహ్వానించింది.
సంబంధిత వార్తలు