చంద్రబాబూ.. మహిళలకు రక్షణ ఏదీ?
వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ సుశీలమ్మ
అనంతపురం, గుత్తి: చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని , నిత్యం మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ సుశీలమ్మ, రాష్ట్ర కార్యదర్శి కొండమ్మ విమర్శించారు. గుత్తి సబ్జైలులో రిమాండ్లో ఉన్న తాడిపత్రి వైఎస్సార్ సీపీ సమన్వయ కర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని బుధవారం పరామర్శించారు.అనంతరం సబ్ జైలు వద్ద విలేకరులతో వారు మాట్లాడారు. మహిళలపై దాడులు చేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులపై అకారణంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. పెద్దారెడ్డి ఎలాంటి తప్పు చేయకున్నా, దాడులకు పాల్పడకున్నా జేసీ బ్రదర్స్(దివాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి) ఆదేశించడంతో పోలీసులు అక్రమ కేసులు బనాయించారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులపై, మహిళలపై దాడులు పెచ్చుమీరుతున్నాయన్నారు. దాడులను అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు మిన్నకుండిపోయారన్నారు. టీడీపీ నాయకులు,ప్రజా ప్రతినిధుల చేతుల్లో పోలీసు యంత్రాంగం కీలు బొమ్మగా మారిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మహిళలకు రక్షణ ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పిల్లలు, వృద్ధులపైనా లైంగిక దాడులు అధికమయ్యాయన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా, జేబులో పర్సులాగా తయ్యారయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా పోలీసులు తమ తీరును, వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు నిర్మలాదేవి, అనంత పార్లమెంట్ కార్యదర్శులు చంద్రగిరి రాధమ్మయాదవ్, శోభారాణి, గుంతకల్లు నియోజకవర్గం మహిళా విభాగం సమన్వయ కర్త ఉమ, సీనియర్ నాయకురాళ్లు శ్రీదేవి, సావిత్రి , ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.