బడ్జెట్.. భేతాళ మాంత్రికుడి సినిమా

బడ్జెట్.. భేతాళ మాంత్రికుడి సినిమా - Sakshi


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ భేతాళ మాంత్రికుడి సినిమాలా ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. ఇందులో ఏ రంగానికీ ప్రాధాన్యం లేదని, పైగా అత్యంత ముఖ్యమైన రాజధాని నిర్మాణాన్ని అసలు బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన విమర్శించారు. కొత్త రాష్ట్రానికి మౌలిక వసతులు చాలా ముఖ్యమని, ఇక్కడ కొత్తగా ఫ్లై ఓవర్లు, భవనాలు చాలా రావాల్సి ఉన్నా.. ఈ రంగానికి కేటాయించిన మొత్తం తూతూ మంత్రంగానే ఉందన్నారు.



పైగా.. ఏ రాష్ట్రంలోనూ ఇంతవరకు ఊహాజనిత బడ్జెట్లు ప్రవేశపెట్టలేదని, ఇప్పుడే తాము తొలిసారి ఊహాజనిత కేటాయింపులు, ఊహాజనిత బడ్జెట్ చూస్తున్నామని చెవిరెడ్డి చెప్పారు. రుణమాఫీ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని, తీరా దాని విషయాన్ని సరిగా ప్రస్తావించలేదని మండిపడ్డారు. ముస్లింలకు, యువతకు చేసిన కేటాయింపులు కూడా నామమాత్రమేనన్నారు. ఏ రంగానికీ మేలు చేసేలా ఈ బడ్జెట్ లేదని, అసలు ప్రభుత్వానికే స్పష్టత లేనప్పుడు ప్రజలకు ఏమిస్తారని అన్నారు. ఈ ప్రభుత్వం కొత్త రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందో.. వెనక్కి లాక్కెళ్తుందో తెలియట్లేదన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top