‘రావాలి జగన్–కావాలి జగన్’ నేటి నుంచి షురూ
లాంఛనంగా అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం ప్రారంభం
ప్రజల్లోకి విస్తృతంగా నవరత్నాలను తీసుకెళ్లేందుకు ప్రణాళిక
కార్యక్రమ నిర్వహణ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించిన వైఎస్సార్ సీపీ అధిష్టానం
సాక్షి, అమరావతిబ్యూరో : జిల్లాలో ‘రావాలి జగన్ – కావాలి జగన్’ అనే కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి అన్ని నియోజకవర్గాల్లో లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో రోజుకు రెండు బూత్లకు వెళ్లి అక్కడ బూత్ కమిటీ అధ్యక్షుడు, కమిటీ సభ్యులతో సమావేశమై గ్రామాల్లో స్థితిగతులను తెలుసుకోనున్నారు. ప్రధానంగా కరపత్రాల ద్వారా వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో విడతల వారీగా ప్రకటించిన ప«థకాలు, నవరత్నాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు నాయకులు సమాయత్తమయ్యారు.
నేటి నుంచి ఇంటింటికి..
ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడి నవరత్నాల గురించి తెలిపి వారికి చేరువయ్యేందుకు పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఇంటిలో వారి యోగ క్షేమాలను అడిగి, ప్రభుత్వ వైఫల్యాలను తెలుసుకుని వారిని చైతన్యం చేయనున్నారు. అదేవిధంగా గ్రామాల్లో లక్షల ఓట్లు తొలగించిన నేపథ్యంలో వాటిని సమీక్షించి తిరిగి చేర్చుకునేందుకు కార్యకర్తలను సిద్ధం చేయబోతున్నారు. ప్రధానంగా ఈ కార్యక్రమం ప్రజల్లోకి చొచ్చుకు పోయే కార్యక్రమం కావడంతో పార్టీ అధిష్టానం సైతం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రజలకు చేరువయ్యే కార్యక్రమం కావడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఇప్పటికే వై.ఎస్.జగన్ నాయకులకు దిశ, నిర్దేశం చేశారు. టీడీపీ నాయకులు చేసే కార్యక్రమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
ప్రజల్లోకి పార్టీ కార్యక్రమాలు.....
టీడీపీ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బుతో నాయకులను, ఓటర్లను కొనుగోలు చేసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని.. వైఎస్సార్కాంగ్రెస్పార్టీ అలాంటిది కాదని, శ్రమనే నమ్ముకున్న పార్టీ అని.. రాజన్న రాజ్యం కోసం పరితపిస్తున్న పార్టీగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడి వైఎస్సార్ సీపీ చేపట్టే కార్యక్రమాలను వివరించి.. వారికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తారు. కష్టపడి పనిచేసే పార్టీకి ఓట్లు వేస్తున్నామనే భావన కల్పించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించా రు. ఈ ‘రావాలి జగన్ –కావాలి జగన్’ కార్యక్రమంలో ఓటర్ల లిస్టులపై కూడా అవగాహన కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. నవరత్నాల ద్వారా ఇన్ని ప్రయోజనకర పథకాలు పార్టీనేత తీసుకొస్తుంటే మనకున్న బలాన్ని, పారదర్శకతతో ప్రజల వద్దకు వెళ్లేందుకు నేతలు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు.