ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా సంకల్పయాత్ర
వైఎస్సార్ సీపీ రాష్ట్ర సీనియర్ నేత బొత్స సత్యనారాయణ
గరివిడి: ప్రజా సమస్యలు తెలుసుకోవడమే వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సాగిస్తున్న ప్రజాసంకల్పయాత్ర లక్ష్యమని పార్టీ రాష్ట్ర నాయకుడు, చీపురుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొత్ససత్యనారాయణ అన్నారు. గరివి డి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో కలిపి శనివారం నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యకర్తలంతా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పంపిణీలో ఎటు వంటి ప్రతిఫలం ఆశించకుండా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించి, నిరంతరం ప్రజలకు సేవచేసేందుకు అందుబాటులో ఉండాలని స్వర్గీయ డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి మా అందరికీ నేర్పారన్నారు. ఆయన చూపించిన మార్గంలోనే నడుస్తున్నామన్నారు. ప్రస్తుత నాటుగున్నరేళ్ల టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, జన్మభూమి కమీటీలు.. ఇలా ప్రతీ ఒక్కరూ పథకాల మంజూరులో కమీషన్లు వసూలు చేస్తున్నారన్నారు. దొరికిన కాడికి దోచుకుంటున్నారని విమర్శించారు.
పింఛన్ మంజూరుకు కూడా సుమారు రూ.5 వేలకు పైబడి వసూలు చేస్తున్నారని బొత్స ఆరోపించారు. జిల్లాలో విమానాశ్రయం పేరుతో సీఎం చంద్రబాబు, కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజు వందలాది మంది రైతుల భూములు లాక్కొని నిరాశ్రయులను చేశారన్నారు. నియోజకవర్గ రైతులకు ఎంతో ఉపయోగపడే తోటపల్లి కాలువ పనులు వైఎస్సార్ హయాంలో 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం పనులను టీడీపీ ప్రభుత్వం పూర్తిచేయలేక పోవడం సిగ్గుచేటన్నారు. ఎచ్చెర్లలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు రాత్రీపగలు శ్రమించి తోటపల్లి పనులు పూర్తిచేసి నట్టు చెప్పుకోవడం చూస్తే నవ్వొస్తుందన్నారు.
ప్రస్తుత జిల్లా మంత్రి సుజయ్కృష్ణ రంగారావు వైఎస్సార్ సీపీ ఫ్యాన్ గుర్తుపై గెలిచి టీడీపీలో చేరి మంత్రిగా కొనసాగడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశెఖర్ మాట్లాడుతూ ప్రజాసంకల్ప యాత్రను ద్విగ్విజయంగా చేసేందుకు ప్రతీకార్యకర్త పూనుకోవాలన్నారు. గ్రామాల్లోని ప్రధాన సమస్యలను పార్టీ నేతలకు అందజేయాలని కోరారు. పార్టీ జిల్లా రాజకీయవ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీని వాసరావు మాట్లాడుతూ ప్రజాసంకల్పయాత్ర చీపురుపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు 50 వేల మంది పురుషులు, 10 వేల మంది మహిళలతో స్వాగతం పలకాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయ కర్త గొర్లె కిరణ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి.సూర్యనారాయణ రాజు, పొట్నూరు సన్యాసినాయు డు, గరివిడి, చీపురుపల్లి, గుర్ల, మెరకముడిదాం మం డలాల అధ్యక్షులు వాకాడ శ్రీనివాసరావు, వి.శ్రీనివాసరావు, శీర అప్పలనాయుడు, తాడ్డి కృష్ణారావు, ఎం.విశ్వేశ్వరరావు, పొన్నాడ వెంకటరమణ, కొణిశి క్రిష్ణంనాయుడు, ముల్లు రాం బాబు, బమ్మిడి అప్పలస్వామి, ఇప్పలి అనంతం, బూర్లె నరేష్ కుమార్, కోట్ల మోతిలాల్ నాయుడు, వరదా ఈశ్వరరావు, పల్లి క్రిష్ణ, కెంగువ మధు, కోట్ల విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.