ప్రత్యేక హోదా కోసం...
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అలుపెరుగని పోరాటం సాగిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఆకాంక్షను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పలువురు కేంద్ర మంత్రుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. హోదా పదేళ్లు కాదు.. 15 ఏళ్ల పాటు కావాలని ఎన్నికల ముందు గోల చేసిన టీడీపీ.. గద్దెనెక్కిన తర్వాత ఆ ఊసే ఎత్తక పోవడాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టారు.
అంతకు ముందు రాష్ట్రం విడిపోకుండా ఉండేందుకు కూడా పోరాటం సాగించిన వైఎస్ జగన్.. విభజనానంతరం రాష్ట్రం ఎదుర్కొంటున్న కష్టాలు, హోదా ఇస్తే ఒనగూరే ప్రయోజనాలు, ఉద్యోగ.. ఉపాధి అవకాశాల గురించి విద్యార్థులు, యువతకు ‘యువభేరి’ల ద్వారా వివరిస్తూ వారితో మమేకమయ్యారు. ప్రత్యేక హోదా కోసం ఇంతగా పోరాడుతున్న నేత మరొకరు లేరని యువత, విద్యార్థులు వ్యాఖ్యానిస్తూ.. జగన్ వెంట అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న అనంతపురంలో నిర్వహించనున్న ‘యువభేరి’పై అందరూ దృష్టి సారించారు.
– సాక్షి, అమరావతి
ప్రత్యేక హోదా కోసం.. ఎప్పుడేమి చేశారంటే...
12.06.2014: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో రాష్ట్రానికి 20 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి డిమాండ్
05.12.2014: ప్రత్యేక హోదా సాధించని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ ధర్నాలు.. విశాఖలో పాల్గొన్న జగన్
16.02.2015: లోక్సభలో బడ్జెట్పై జరిగిన చర్చలో ఏపీకి తక్షణం ప్రత్యేక హోదా ప్రకటించాలని పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి డిమాండ్
15.06.2015: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వైఎస్ జగన్ వినతి పత్రం
03.06.2015: జగన్ సమర దీక్ష (మంగళగిరి)
ఏడాది గడిచినా సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి పట్టించుకోలేదని వైఎస్ జగన్ రెండు రోజుల పాటు (3, 4 తేదీలు) సమర దీక్ష చేపట్టారు. బాబు పాలనపై ప్రజా బ్యాలట్ నిర్వహించారు.
10.08.2015 : ఢిల్లీలో జగన్ నేతృత్వంలో ఒకరోజు ధర్నా
29.08.2015 : వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు మేరకు సంపూర్ణంగా రాష్ట్ర బంద్
07.10.2015 : గుంటూరులో ఏడు రోజుల దీక్ష
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ 07 నుంచి 13 వరకు జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ప్రధాని మోదీ ఏపీకి రానున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా ఆకాంక్ష ఎంత బలీయంగా ఉందో చాటి చెప్పడానికి దీక్ష చేపడితే ప్రభుత్వం పోలీసుల ద్వారా భగ్నం చేసింది.
17.10.2015: జగన్ పిలుపుతో మూడు రోజుల పాటు (17 నుంచి 21 వరకు) పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు
27.01.2015: కాకినాడలో బహిరంగ సభలో పాల్గొన్న జగన్
10.05.2016: కలెక్టరేట్ల వద్ద ధర్నా
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా.. కాకినాడ ధర్నాలో జగన్ పాల్గొన్నారు.
21.07.2016: రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ఏపీకి ప్రత్యేక హోదా బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు
23.07.2016: ఆంధ్రప్రదేశ్కు 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని కోరుతూ పార్లమెంట్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రైవేట్ బిల్లు ప్రతిపాదన
29.07.2016: ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం, టీడీపీ, బీజేపీ వైఖరికి నిరసనగా ఆగస్టు 2న రాష్ట్ర బంద్కు వైఎస్సార్సీపీ పిలుపు
02.08.2016: ప్రత్యేక హోదాకు మద్దతుగా రాష్ట్ర బంద్
08.08.2016: ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి జగన్, పార్టీ ఎంపీలు వినతిపత్రం
10.09.2016: ప్రత్యేక హోదాపై జైట్లీ వైఖరి, చంద్రబాబు తీరుకు నిరసనగా రాష్ట్ర బంద్
10.09.2016: శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా (08 నుంచి 10 వరకు) ఆవస్యకతను చాటిచెప్పిన జగన్, ఇతర నేతలు
26.01.2017: ప్రత్యేక హోదాకు మద్దతుగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనడానికి వైఎస్ జగన్ వెళ్తుండగా ప్రభుత్వం విశాఖలో ఎయిర్పోర్టులోనే అడ్డుకుంది.
యువభేరీలు..
15.09.2015 : తిరుపతి
22.09.2015 : విశాఖపట్నం
27.01.2015 : కాకినాడ
02.02.2016 : శ్రీకాకుళం
04.08.2016 : నెల్లూరు
22.09.2016 : ఏలూరు
25.10.2016 – కర్నూలు
19.12.2016 – విజయనగరం
16.02.2017 – గుంటూరు
10–10–2017 – అనంతపురంలో నిర్వహించనున్నారు
రాష్ట్రపతితో భేటీ
09.06.2015: వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధివర్గం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యింది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే విధంగా చూడాలని విజ్ఞప్తి చేసింది. విభజన చట్టంలోని హామీలు అమలయ్యేలా చూడాలని విన్నవించింది.
23.02.2016: ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసిన వైఎస్ జగన్.. ప్రత్యేక హోదాతో పాటు విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేలా చూడాలని వినతి
ప్రధానిని కలసిన జగన్
19.05.2014: ప్రత్యేక హోదాతో పాటు విభజన బిల్లులోని హామీలు నెరవేర్చాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలోని గుజరాత్ భవన్లో కలసి విజ్ఞప్తి చేశారు.
30.03.2015: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రతినిధి వర్గం విభజన హామీలను నెరవేర్చాలని వినతి పత్రం
కేంద్ర మంత్రులకు వినతి
11.06.2015: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని జగన్, పార్టీ నేతలు కలిశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చి ఆదుకోవాలని, విభజన చట్టంలో పొందు పరచిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.
27.04.2016: ఢిల్లీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి జగన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం