చంద్రబాబు అవినీతి వల్లే.. రాష్ట్రానికి ద్రోహం
నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా) : సీఎం చంద్రబాబు నాయుడు అసమర్ధత, అవినీతి వల్లే విభజన హామీలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేస్తోందని నరసాపురంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు అవినీతిమయం అవుతున్నాయన్న ఉద్దేశంతోనే ఏపీపై కేంద్రం చిన్న చూపు చూస్తోందన్నారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేది లేనిది త్వరలో శాసన సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఎన్నికల తర్వాతే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కలిసివచ్చే పార్టీలతో కలిసి పోరాడుతామని పేర్కొన్నారు. శాసనసభ్యుల కొనుగోలును టీడీపీ వ్యాపారంగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. రామాయపట్నం పోర్టును టీడీపీ ఉద్దేశ పూర్వకంగానే అడ్డుకుంటుందని మండిపడ్డారు. విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉందన్నారు. ఓటుకు నోట్లు కేసులో అడ్డంగా దొరికి పోయిన కారణంగానే చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేని పరిస్ధితిలో ఉన్నారన్నారు.