వైఎస్ అవినాష్రెడ్డి పాదయాత్ర ప్రారంభం
సాక్షి, కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పేరుతో చేస్తున్న పాదయాత్ర రెండువేల కిలోమీటర్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఆయనకు సంఘీభావంగా పులివెందుల నియోజకవర్గంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పులివెందుల నుంచి ప్రారంభమైన అవినాష్ రెడ్డి పాదయాత్రకు మేయర్ సురేష్ బాబు, వైఎస్ మనోహర్ రెడ్డి తదితరులు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ..పులివెందుల ప్రాంతానికి కృష్ణ జలాలు రావడానికి వైఎస్సార్ చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ పాదయాత్ర సాగిస్తున్నామన్నారు. చంద్రబాబు మోసాలతో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టారన్నారు. ఈ రోజు పులివెందుల నుంచి వేముల చెరువు వరుకు, రేపు పులివెందుల నుంచి ఎర్రబెల్లి చెరువు వరకు పాదయాత్ర ఉంటుందని పేర్కొన్నారు.