‘టీడీపీ ఎలా గెలిచిందో దేశమంతా తెలుసు’
అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు టీడీపీనే గెలవాలని చంద్రబాబు మాట్లాడటం నియంత ధోరణిని తెలియచేస్తోందని బుగ్గన మండిపడ్డారు. ముఖ్యమంత్రికి ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీల వ్యవహారాన్ని ప్రతిపక్షం నిలదీస్తుందనే భయం పట్టుకుందన్నారు. అందుకే అసెంబ్లీ సమావేశాలను కూడా పెట్టడం లేదన్నారు.
నంద్యాల, కాకినాడలో టీడీపీ ఎలా గెలిచిందో దేశమంతా తెలుసని బుగ్గన ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం పెద్ద గొప్పేమీ కాదన్నారు. 2004 నుంచి 2014 వరకూ జరిగిన ఉప ఎన్నికల్లో 40కి పైగా సీట్లలో టీడీపీ ఓడిపోయిందన్నారు. మూడొంతుల స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదని బుగ్గన ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ కొనుగోలు రాజకీయాలు సాధారణ ఎన్నికల్లో చెల్లవని ఆయన వ్యాఖ్యానించారు.