వైఎస్సార్ స్ఫూర్తితో అందరికీ సంక్షేమ ఫలాలు
వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవాలి
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: మరణంలేని మహానేత వైఎస్సార్ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు(బుధవారం) వైఎస్సార్ జన్మదినం సందర్భంగా విగ్రహాలకు దండలు వేసి నివాళర్పించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవం గా జరుపుకోవాలని తెలిపారు.
‘‘దివంగత మహానేత వైఎస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పేదలకు 32 లక్షల ఎకరాలు పంచారు. ఆరోగ్యశ్రీతో పేదలను ఆదుకున్నారు. పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా గుండె ఆపరేషన్లు’’ చేయించారని అంబటి రాంబాబు గుర్తుచేశారు. వైఎస్సార్ స్ఫూర్తితో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రాకపోవడం గమనించాలన్నారు. చెట్టు పేరు చెప్పుకుంటు కాయలు అమ్ముకునే వాళ్ళను పార్టీ సహించదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.