దళిత జాతిని కించపరిస్తే ఖబడ్దార్
అనంతపురం ఓల్డ్సిటి: దళిత జాతిని కించపరిస్తే ఖబడ్దార్ అంటూ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పెన్నోబుళేసు అధికార పార్టీ ప్రజాప్రతినిధులను హెచ్చరించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దళిత జాతిని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగజ్జీవన్రామ్, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం అంబేడ్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా పెన్నోబుళేసు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దళితజాతి పాదాభివందనం చేయాలని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు మాట్లాడటం దారుణమన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఒక్క దళితుడికైనా పక్కాగృహం నిర్మించారా? ఒక్క ఎకరా భూమినైనా పంపిణీ చేయకపోగా దళితుల భూములను లాక్కొని రోడ్డున పడేసినందుకు కాళ్లు మొక్కాలా? రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా దళిత ప్రజలు, అధికారులపై దాడులు చేస్తున్నందుకా?ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తున్నందుకా? జన్మభూమి కమిటీల పేరుతో దళితులకు చెందిన ప్రభుత్వ ఫలాలను హరిస్తున్నందుకా? ఎందుకు కాళ్లు మొక్కాలని ప్రశ్నించారు.
రాష్ట్రంలో దళిత పక్షపాతిగా పాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాబోయే రాజన్న రాజ్యంలో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఉచిత విద్యుత్ అందజేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఎస్సీ రమణ, రామగిరి చిన్న పెద్దన్న, ముత్యాలన్న, డాక్టర్ కుళ్లాయిస్వామి, అనిల్కుమార్, కుంచెంరమేష్, మహిళా రాష్ట్ర నాయకురాలు దేవి, జిల్లా నాయకులు కృష్ణవేణి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు యు.పి.నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.