నల్లజెండాలు నాడు రాహుల్కు.. నేడు మోదీకి
సాక్షి, విజయవాడ: నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కులేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఏపీకి బీజేపీ తీరని అన్యాయం చేసిందన్నమాట వాస్తమేనని, దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే అని ఆయన అన్నారు. గతంలో రాహుల్ గాంధీ ఏపీ పర్యటనకు వస్తే చంద్రబాబు నల్లజెండాలతో నిరసన తెలిపారని, ఇప్పుడు రాహుల్ కాళ్లు పట్టుకునే స్థితికి చంద్రబాబు దిగజారిపోయారని పేర్కొన్నారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం గతంలో తాము పోరాటం చేస్తే అరెస్టులు చేసి అణచివేశారని ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నదేమిటని ఆయన ప్రశ్నించారు.
శనివారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గతంలో రాహుల్ను విమర్శించిన చంద్రబాబే నేడు ఆయన ప్రధాని కావాలని అంటున్నారు. నాలుగు రోజులు అయ్యాక మోదీ మరోసారి ప్రధాని కావాలని చంద్రబాబు అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ధర్మపోరాట దీక్ష పేరుతో చంద్రబాబు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. నాలుగేళ్లుగా కేంద్రంతో పోరాడితే హోదా ఎప్పుడో వచ్చేది. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపేంత వరకు ప్రమాణ స్వీకారం చేయ్యనని గతంలో చంద్రబాబు అన్నారు. హోదాపై అలా ఎందుకు చెయ్యలేదు. అసెంబ్లీ స్పీకర్ చంద్రబాబును పొగడటం విచిత్రంగా ఉంది. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ రాజకీయ వ్యాఖ్యలేమిటి. అసెంబ్లీకి రాకపోతే జీతాలు ఇవ్వద్దని ఏ చట్టంలో ఉంది. గత నాలుగేళ్లుగా డిప్యూటీ స్పీకర్ ఏనాడైనా సభను నడిపించారా. కోడెల శివప్రసాద్ మాత్రమే చంద్రబాబు మాట వింటారు కాబట్టి ఆయనకే అవకాశం ఇస్తున్నారు’’ అని అన్నారు.