ప్రజా సంక్షేమమే వైఎస్సార్ సీపీ లక్ష్యం
వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రగిరి ఏసురత్నం
ఉత్సాహంగా రావాలి జగన్.. కావాలి జగన్
నవరత్నాలతో అన్ని వర్గాలకు భరోసా
సాక్షి, పట్నంబజారు: ప్రజా సంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రగిరి ఏసురత్నం చెప్పారు. నియోజకవర్గంలోని 19వ డివిజన్ వర్కర్స్ కాలనీలో డివిజన్ అధ్యక్షుడు పల్లపు మహేష్బాబు ఆధ్వర్యంలో ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఇంటికి వెళుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. నవరత్నాల పథకాలను కరపత్రాల ద్వారా వివరించారు.
పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, వారి అభివృద్ధి కోసం ఎనలేని త్యాగాలు, పోరాటాలు చేసిన ఘనత జననేత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా ఏసురత్నం మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతటి ఉద్యమాలు వైఎస్ జగన్ చేపట్టారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమేనన్నారు. రాష్ట్రంలో తిరిగి రాజన్న పాలన కోసం వై.ఎస్.జగన్ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారన్నారు.
ఆనాటి సువర్ణయుగం మరికొద్దిరోజుల్లో రాష్ట్ర ప్రజలకు అందనుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయని ఎద్దేవా చేశారు. జనసేన అసలు ఏమాత్రం పోటీ కాదని, ప్రజలే చెబుతున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు పక్కా గృహాలు నిర్మించేందుకు పాటు పడతామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నవరత్నాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
కార్యక్రమంలో వైఎస్సార్సీపీ డివిజన్ నేతలు బొబ్బిలి శ్రీను, కొమ్మెర రాము, సోమి కమల్, బుజ్జి, షేక్సుభాని, మధు, వెంకటేష్, జానీ, నాగూర్, ఎద్దనపల్లి బాలరాజు, ముక్తం బాషా, గౌస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చంద్రగిరి కుటుంబ సభ్యుల ప్రచారం
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్ సీపీ నేత చంద్రగిరి ఏసురత్నంకు మద్దతుగా ఆయన సతీమణి కరుణకుమారి, కుమార్తె సృజనలు ప్రచారం చేపట్టారు. 31వ డివిజన్ అధ్యక్షుడు హరిప్రసాద్, ఐటీ విభాగం నగర అధ్యక్షుడు ఇన్నారెడ్డి ఆధ్వర్యంలో పట్టాభిపురంలోని కాంచన టవర్స్ నందు రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీ రెడ్డి, రాజ్యలక్ష్మిరెడ్డి, జ్యోతి, రమాదేవి, కంజుల శివశంకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు