రేపు పులివెందులలో వైఎస్ వివేకా అంత్యక్రియలు
సాక్షి, పులివెందుల : వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు శనివారం ఉదయం 11 గంటలకు జరగనున్నాయి. పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి సమాధి పక్కనే వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డిని కడసారి చూసేందుకు అభిమానులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
కాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ చేయాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, సౌమ్యుడిగా పేరు పొందిన మాజీ ఎంపీని ఇంట్లో ఎవరు లేని సమయంలో గొడ్డలితో నరికి అత్యంత దారుణంగా చంపడం ఎక్కడ ఉండదని, ఆయన వయసు చూసినా, వ్యక్తిత్వం చూసినా ఎవరూ కూడా చంపాలని ఆలోచన చేయరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వైఎస్సార్ సీపీ శ్రేణులు సంయమనం పాటించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.