వర్షం కారణంగా నిలిచిన నేటి ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గురువారం రద్దయింది. విశాఖలో కురుస్తున్న వర్షం కారణంగా పాదయాత్రకు వీలుకాక పోవడంతో నేటి(267వ రోజు) ప్రజాసంకల్పయాత్రకు విరామం ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం నేటి ఉదయం రాజన్న తనయుడు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పప్పలవాని పాలెం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించాల్సి ఉంది.
అయితే వర్షం కారణంగా ప్రతికూల వాతావరణంలో పాదయాత్ర సాధ్యం కాదని భావించి వైఎస్ జగన్ నేడు పాదయాత్రను రద్దు చేసుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు జననేత చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు.