మీ చొరవతో ప్రభుత్వం దిగొచ్చింది
వైఎస్ జగన్తో జిల్లా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు
‘మునిసిపల్ కార్మికుల వేతన డిమాండ్కు జిల్లాలో 14 రోజులు సమ్మె చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరకు ఇదే జిల్లాలో ఓదార్పుయాత్ర చేస్తున్న మీరు కార్మిక సంఘాల వినతి మేరకు స్పందించి మద్ధతు తెలిపి ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేసిన రెండ్రోజుల్లోనే ప్రభుత్వం దిగివచ్చింది’ అంటూ జగన్ దృష్టికి జిల్లా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ నాయకులు తీసుకెళ్లారు. మంగళవారం బుక్కపట్నం మండల మారాల గ్రామ సమీపంలో పాదయాత్రకు వారు సంఘీభావం తెలిపారు.
కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మునిసిపల్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జగన్ను కలిసిన వారిలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్, నగర కార్యదర్శి గోపాల్, మునిసిపల్ కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి నాగభూషణం, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఉపేంద్ర తదితరులు ఉన్నారు.