ధీరుని వెంటే జనమంతా
పూలవాన కురిపించినఎస్ఎం పురం, కేశవరావుపేట గ్రామస్తులు
అభిమాన జడిలోతడిసి ముద్దయిన జగన్
నేడు శ్రీకాకుళం నగరంలో బహిరంగ సభ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆ సంకల్ప ధీరుని వెంటే జనమంతా కదిలారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చేందుకు జగన్ వెంట తరలివచ్చారు. దీంతో పల్లె ప్రాంతాల్లో సందడి నెలకొంది. ఆయన అడుగుపెడుతున్న క్షణాల అడుగుల్లో పూలవానలు కురిపిస్తూ.. జనమంతా సంబరా లు జరుపుకున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా 315వ రోజు శుక్రవారం ఎచ్చెర్ల నియోజకవర్గం కేశవరెడ్డి స్కూల్ ఆవరణ నుంచి రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. ఎస్ఎం పురం, కేశవరావుపేట, లకు‡్ష్మడిపేట, నవభారత్నగర్ మీదుగా ఫరీదుపేట వరకూ యాత్ర దిగ్విజయంగా సాగింది. ప్రధానంగా చూస్తే గురువారం సాయంత్రం జరిగిన చిలకపాలెం బహిరంగ సభ తర్వాత నుంచి పలు గ్రామాల్లో టీడీపీ నేతలు శుక్రవారం నాటి పాదయాత్రలో యువకులు, మహిళలు పెద్దగా హాజరుకాకుండా చేసేందుకు యత్నిం చినట్లు తెలిసింది. అయితే ఇలాంటి ఒత్తిళ్లు ఏమాత్రం పనిచెయ్యకపోగా, మరింత రెట్టింపైన ఉత్సాహంగా గ్రామాల నుంచి జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా శుక్రవారం నాటి పాదయాత్ర టీడీపీ అనుకూల గ్రామాల్లో సాగినప్పటికీ, మహిళలు, యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. జగనన్నకు గ్రీన్కార్పెట్ పరిచి, పూలవర్షం కురిపించారు. సాక్షాత్తు జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలు చౌదరి ధనలక్ష్మి స్వగ్రామమైన ఎస్ఎం పురంలో కూడా భారీగా జనం తరలివచ్చి, జగనన్నను చూసి, ఆయన వెంట నడిచారు.
ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, వైఎస్సార్సీపీ కీలక కార్యకర్తలు, నేతలు ఘనంగా జగన్కు ఘన స్వాగతం పలికారు. పులివేషాలు, తప్పెటగుళ్లు, దక్షిణ సన్నాయి మేళంతో తీన్మార్ డాన్సులు, డప్పు వాయిద్యాలతో యువకులు కేరింతలతో ఎస్.ఎం.పురం సంబరంగా మారింది. జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, నారాయణమూర్తిల స్వగ్రామమైన ఎస్ఎం పురంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జగనన్నకు మద్దతు లభించింది. దాదాపుగా ఈ పంచాయతీ అనుబంధ గ్రామాలన్నీ కలిసి రావడంతో జిల్లావ్యాప్తంగా చర్చకు దారితీసింది. మన సీఎం జగనన్న అంటూ యువకులు బైక్ ర్యాలీ నిర్వహించి నినాదాలు చేయడం ఆకట్టుకుంది. అలాగే ఇదే గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలంతా జగనన్నకే మా మద్దతు అంటూ ఫ్లెక్సీలతో ర్యా లీగా వెళ్లి కలిశారు.
తర్వాత మరో కీలక టీడీపీ మద్దతున్న కేశవరావుపేట గ్రామ సరిహద్దులో కూడా బాణసంచా కాల్చి జగనన్నకు స్వాగతం పలికారు. అలాగే నవభారత్నగర్, ఫరీద్పేటలో కూడా జనం పెద్ద సంఖ్యలో వచ్చి జగనన్నతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
వినతులు వింటూ
పాదయాత్రలో భాగంగా జగనన్నను కలిసి, ఆయనకు తమ సమస్యలను చెప్పేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చి, వినతులు సమర్పించారు. కేశవరెడ్డి విద్యాసంస్థల నుంచి జిల్లా కేంద్రం నుంచే 252 మంది నుంచి సుమారు రూ.6 కోట్లు వరకు డిపాజిట్లు వసూలు చేశారని, ఇందులో పదోతరగతి పూర్తి చేసుకున్న వారికి తిరిగి ఇవ్వలేదం టూ పలువురు బాధితులు జగన్కు విన్నవించారు.
అలాగే హిందీ పం డిట్ ఉద్యోగానికి హిందీ ప్రచారక్ శిక్షణ పూర్తి చేసినప్పటికీ, తాజా డీఎస్సీలో దరఖాస్తుకు అవకాశం ఇవ్వడం లేదంటూ ఓ అభ్యర్థిని విన్నవించుకో గా, మరో యువతి తాను సెంచూరియన్ యూనివర్సిటీలో అగ్రి బీఎస్సీ చేసినప్పటికీ వ్యవసాయాధికారి పోస్టులకు రాష్ట్రంలో అర్హతగా ఇవ్వడం లేదని వాపోయిం ది. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం వర్తించేలా జగన్ తీసుకున్న నిర్ణయం ఎంతో విశిష్టమైందని, దీన్ని మహిళా లోకమంతా హర్షిస్తుందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మారెడ్డి తదతర బృందం కలిసి జగన్కు వివరించారు. అలాగే అంబేడ్కర్ యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్టీచింగ్ స్టాఫ్ను రెగ్యులర్ చేయాలంటూ విన్నవించారు.
పాల్గొన్న నేతలు
పాదయాత్రలో రాజంపేట మాజీ ఎంపీ మిథున్రెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, తమ్మినేని సీతారాం, గుడివాడ అమర్నాథ్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్కుమార్, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి, జిల్లా పార్టీ మీడియా సెల్ కన్వీనర్ మండవల్లి రవి, పార్టీ నేతలు హనుమంతు కిరణ్కుమార్, ఎన్ని ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
నేడు శ్రీకాకుళంలో బహిరంగ సభ
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మధ్యాహ్నం జిల్లా కేంద్రం శ్రీకాకుళం నగరంలో అడుగుపెట్టనున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఫరీదుపేట నుంచి పాదయాత్రగా శ్రీకాకుళం నగర సరి హద్దులోకి రానున్నారు. అనంతరం గుజరాతిపేట బ్రిడ్జి మీదుగా ఏడు రోడ్ల కూడలి రోడ్డు వద్ద మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలియజేశారు. జగనన్న నగరానికి రానున్న నేపథ్యంలో రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం తదితరుల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులంతా నగరంలో భారీగా ఏర్పాట్లు చేశారు. అలాగే బహిరంగ సభ అనంతరం జగన్ పాదయాత్రగా వెళ్లి నగరంలోనే రాత్రి బస చేయనున్నారు.