చోడవరంలో నేడు జగన్ బహిరంగ సభ
251వ రోజు పాదయాత్ర
వూడేరు క్రాస్ శివారు నుంచి ప్రారంభం
మధ్యాహ్నం 3 గంటలకు చోడవరం కొత్తూరు జంక్షన్లో బహిరంగసభ
విజయవంతం చేయాలని తలశిల రఘురాం పిలుపు
సాక్షి, విశాఖపట్నం: ఏపీ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 251వ రోజు శనివారం కూడా అనకాపల్లి నియోజకవర్గం నుంచి చోడవరం నియోజకవర్గంలోకి ప్రవేశించనుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం వెల్లడించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చోడవరం టౌన్ కొత్తూరు జంక్షన్లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగసభలో జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తారన్నారు.
అనకాపల్లి నియోజకవర్గం వూడేరు క్రాస్ శివారులో బస చేసిన ప్రాంతం నుంచి శనివారం ఉదయం ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న పాదయాత్ర మామిడిపాలెం మీదుగా గంధవరం వద్ద చోడవరం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందన్నారు. అక్కడ నుండి దుడ్డుపాలెం జంక్షన్, ముద్దుర్తి జంక్షన్, వెంకన్నపాలెం, అంభేరు పురం, గోవాడ గజపతి నగరం మీదుగా చోడవరం పెట్రోల్ బంకు వద్ద టౌన్లోకి అడుగుపెడుతుందన్నారు. టౌన్ నుంచి నేరుగా కొత్తూరు జంక్షన్కు చేరుకుని అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ప్రజలనుద్దేశించి జననేత ప్రసంగించనున్నారని తెలిపారు. అనంతరం మెయిన్రోడ్డు, ఆంధ్రాబ్యాంకు రోడ్డు, చినబజారు మీదుగా అన్నవరం జంక్షన్ వద్ద రాత్రికి బçసకు చేరుకుంటారన్నారు. చోడవరం నియోజకవర్గంలో అడుగుపెడుతున్న పాదయాత్ర, కొత్తూరు జంక్షన్లో జరిగే బహిరంగసభలో వేలాదిగా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని రఘురాం కోరారు.