వజ్ర సంకల్పంతో ప్రజా క్షేత్రంలోకి

YS Jagan Prajasankalpayatra Restart From Today - Sakshi

     నేటి నుంచి పునఃప్రారంభం కానున్న ప్రజా సంకల్పయాత్ర  

     విశాఖ ఎయిర్‌పోర్ట్‌ వద్ద ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు ఆత్మీయ స్వాగతం 

సాక్షి ప్రతినిధి, విజయనగరం/ సాక్షి ప్రత్యేక ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయనగరం జిల్లాలో సోమవారం నుంచి పునఃప్రారంభం కానుంది. ప్రజల కష్టాలు తెలుసుకుని వారికి ధైర్యం చెబుతూ.. భవిష్యత్తు పట్ల భరోసా కల్పిస్తూ అశేష జన ప్రభంజనం నడుమ 11 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని, 12వ జిల్లా విజయనగరంలో పాదయాత్ర సాగిస్తున్న తరుణంలో రాజకీయ దుష్టశక్తులు జననేతపై హత్యాయత్నానికి తెగబడిన విషయం తెలిసిందే.

విశాఖ విమానాశ్రయంలో గత నెల 25వ తేదీన వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో గాయపడిన ఆయనకు చికిత్స చేసిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్ర ప్రారంభించేందుకు హైదరాబాద్‌ నుంచి ఆదివారం సాయంత్రం బయలుదేరి విశాఖ ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు బ్రహ్మరథం పలికారు.  
హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌ నుంచి పాదయాత్రకు బయలుదేరుతున్న వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు చెబుతున్న అభిమానులు 

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పోటెత్తిన జనం 
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం జననేతకు ఆత్మీయ స్వాగతం లభించింది. ప్రాణాపాయం నుంచి త్రుటిలో బయటపడిన తమ అభిమాన నాయకుడిని చూసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఎయిర్‌పోర్ట్‌కు ప్రవాహంలా తరలి వచ్చారు. జైజగన్‌ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. జగన్‌ చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అక్కడి నుంచి విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని మక్కువ మండలం పాయకపాడు వద్ద శిబిరానికి రోడ్డు మార్గంలో వెళ్లారు. దారిపొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో జననేతకు ఘనస్వాగతం పలికారు.
జననేతకు స్వాగతం పలికేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top