పండగలా వచ్చాడు...
పల్లెవాకిట అడుగిడిన జననేతకు అపూర్వ ఆదరణ
ఘన స్వాగతం పలికిన గజపతినగరం నియోజకవర్గం
నాలుగు నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి
కెంగువ, ముచ్చెర్ల గ్రామాల్లో మహానేత విగ్రహాల ఆవిష్కరణ
పూలవర్షంతో జననేతను ముంచెత్తిన ముచ్చెర్ల, జిన్నాం ప్రజలు
సాక్షిప్రతినిధి విజయనగరం: ప్రతిఒక్కరినీ పలకరిస్తున్నారు. అందరి సమస్యలూ తెలుసుకుంటున్నారు. కన్నీళ్లు తుడుస్తున్నారు. కష్టాలు తీరే కాలం మరెంతో దూరంలో లేదని తెలియజేస్తున్నారు. ఇదీ జననేత పాదయాత్రలో ప్రత్యేకతలు. అందుకే ఆయన వస్తున్నారని తెలిస్తే చాలు తమ గడపకు పండగొచ్చినట్టు భావిస్తున్నారు. ముంగిటకు వచ్చిన రాజన్న బిడ్డను చూసి ఆనంద పారవశ్యమవుతున్నారు. అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పూల వర్షంతో అభిమానం చూపిస్తున్నారు.
నాలుగు నియోజకవర్గాల్లోపాదయాత్ర విజయవంతం
వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్ప యాత్ర విజయనగరం జిల్లాలో ఇప్పటివరకూ నాలుగు నియోజకవర్గాల్లో విజయవంతంగా పూర్తయింది. గత నెల 24న ఎస్కోట నియోజకవర్గంలో ప్రవేశించిన పాదయాత్ర మంగళవారం నాటికి గజపతినగరం నియోజకవర్గంలో ప్రవేశించిం ది. గుర్ల మండలం గరికవలస నుంచి ప్రా రంభమైన పాదయాత్ర గజపతినగరం నియోజకవర్గంలోని కెంగువ మీదుగా ముచ్చెర్ల గ్రామానికి చేరుకుంది. అక్కడి నుంచి మధ్యాహ్న భోజన విరామానంత రం బయలు దేరి కొండపల్లి క్రాస్ మీదుగా జిన్నాం గ్రామ పంచాయతీ శివారుల్లో ఏర్పాటు చేసిన బస వద్దకు చేరుకుంది. నియోజకవర్గంలోకి జననేత అడుగు పెట్ట గానే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ముస్లింలు, క్రై స్తవ మత పెద్దలు, వేదపండితులు పాదయాత్ర దిగ్విజయవంతంగా సాగాలని ప్రార్ధనలు చేశా రు. కెంగువ గ్రామ పంచాయతీ శివారులో డప్పు ల వాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనలతో అభిమాన నేతకు ఆహ్వానించారు. ఈ సందర్భం గా కెంగువ, ముచ్చెర్ల గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించి ఘన నివాళులర్పించారు.
పాదయాత్రలో సమస్యల వెల్లువ
అన్నా నేను కిరోసిన్, డీజిల్ ఇంజిన్లు మరమ్మతు పనులు చేసుకుని వచ్చే డబ్బులతో జీవిస్తున్నా. ఇప్పుడా పనులు కూడా లేవు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇద్దరు ఆడపిల్లల పథకంలో పేరు నమోదు చేయించుకున్నామన్నా. నా కుమార్తె బూడి ఝాన్సీ పేరున అకౌంట్ ప్రారంభించారన్నా. అకౌంట్లో ఒక్క రూపాయి కూడా వేయలేదు. కానీ మా పేరున రూ.2,500 జమ చేసినట్టు కాగితమిచ్చారన్నా. ఇదేం న్యాయమన్నా అంటూ కెంగువ గ్రామానికి చెందిన పాపినాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు కావడం లేదని, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఫ్యాన్లు, బెంచీలు లేవనీ లోగిశ జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థినులు విన్నవించారు. మంచాలు, దివాన్కాట్లు తయారీకి కావాల్సిన కలప ధర పెరిగిపోవడంతో వండ్రంగి పని చేయలేకపోతున్నామని ముచ్చెర్ల గ్రామానికి చెందిన వండ్రంగి పనివారు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గీత కార్మికుల సంక్షేమానికి ఎన్నో హామీలిచ్చి వాటిని నెరవేర్చకుండా చంద్రబాబునాయుడు మోసం చేశాడన్నా.. అని ఆంధ్రప్రదేశ్ యాత, గౌడ, శ్రీశైన, శెట్టి బలిజ, ఈడిగ గీత కార్మిక సంఘం సభ్యులు వాపోయారు. గుర్ల మండలం గరికివలస గ్రామంలోని భూములన్నీ వర్షాధారమేననీ, గడిగెడ్డ రిజర్వాయర్కు తోట పల్లి నీటిని అనుసంధానం చేయాలని, గడిగెడ్డ రిజర్వాయర్ కాలువలను పల్లిగండ్రేడు నుంచి కెంగువ గ్రామం వరకు సీసీ కాలువలు ఏర్పాటుచేస్తే 3వేల ఎకరాలకు చెందిన రైతులు లబ్ధి పొందుతారని రైతులు తెలి పారు. అందరితో ఆప్యాయంగా మాట్లాడి న వైఎస్ జగన్ వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు.
పాదయాత్రలో పార్టీ సైనికులు: పాదయాత్రలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఇన్చార్జి భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర ప్రొగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, బాపట్ల, పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు కోన రఘుపతి, విశ్వాసరాయి కళావతి, కం బాల జోగులు, పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్రాజ్, గజపతినగరం, పార్వతీపురం నియోజకవర్లా సమన్వయకర్తలు బొత్స అప్పలనర్సయ్య, అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.