సంకల్పమే ఊపిరిగా...
జిల్లాకు చేరుకున్న జననేత జగన్మోహన్రెడ్డి
నేటినుంచి ప్రజా సంకల్పయాత్ర పునఃప్రారంభం
హత్యాయత్నం నుంచి బయటపడి ప్రజాక్షేత్రంలోకి వస్తున్న జగనన్న
విశాఖ విమానాశ్రయం నుంచి అడుగడుగునా జననేతకు స్వాగతం
ఆయన రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రజానీకం
సంకల్పం మంచిదైతే... ఎన్ని అవరోధాలు ఎదురైనా అధిగమించవచ్చు. ఆశయం అందరి మేలుకోరేదైతే... ఎన్ని కుట్రలనైనా ఎదుర్కొనవచ్చు. జనం ఆశీస్సులు మెండుగా ఉంటే... ఎలాంటి ప్రమాదాలనుంచైనా గట్టెక్కవచ్చు. జననేత విషయంలో అదే జరిగింది. నిరంతరం ప్రజల మధ్యే ఉండాలనీ... వారి బాగోగులు చూడాలనీ... వారి సమస్యలు తెలుసుకోవాలనీ... వారికి కొండంత అండగా నిలవాలనీ... వారి కన్నీళ్లు తుడవాలనీ... ఎంతో ఉదాత్త ఆలోచనతో బయలుదేరిన బహుదూరపు బాట సారిపై జరిగిన హత్యాయత్నం లక్షలాదిమంది అభిమానం ముందు కొట్టుకుపోయింది. మృత్యుంజ యుడై తమ వద్దకు వస్తున్న రాజన్నబిడ్డను అక్కున చేర్చుకునేందుకు జిల్లా ప్రజానీకం సంసిద్ధమైంది.
సాక్షి ప్రతినిధి విజయనగరం: ‘హమ్మయ్య ... మా నాయకుడికి ఏమీ కాలేదు. మా అభిమానం ముందు... దైవం ఆశీస్సుల ముందు ఆయనపై కుట్రలు తుక్కుగా మారిపోతాయి. ఆయనపై హత్యాయత్నం జరిగినా మృత్యుంజయుడై వస్తాడు.’ ఆ నమ్మకంతోనే దాదాపు 17రోజులుగా తమనుంచి దూరమైన ఆ నాయకుడిని ఎప్పుడెప్పు డు చూద్దామా... చిరునవ్వుతో ఆయన పలకరిం పునకు నోచుకుంటామా... అని ఎదురు చూసిన జనం కోరిక తీరింది. అందరి ఆకాంక్షల మేరకు మళ్లీ జననేత ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు. తిరిగి సోమవారం నుంచి ప్రజాసంకల్ప యాత్ర ద్వారా తమను కలుసుకునేందుకు జిల్లాకు వచ్చేశారు. 295వ రోజైన సోమవారం పాదయాత్ర సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పాయకపాడు నుంచి మొదలై కొయ్యానపేట వరకు సాగనుంది. ఇందుకోసం ఆదివారం రాత్రే జననేత పాయకపాడులోని రాత్రిబస వద్దకు చేరుకున్నారు.
క్షణమొక యుగంలా...
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అక్టోబర్ 25న మక్కువ మండలం పాయకపాడు వద్ద 294వ రోజు పాదయాత్ర ముగించుకుని వెళ్లొస్తానంటూ అందరికీ చిరునవ్వుతో అభివాదం చేసి వెళ్లారు. అలా వెళ్లిన ఆయనపై విశాఖ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్లో ఫ్యూజన్ఫుడ్స్ వెయిటర్ శ్రీనివాసరావు కత్తి తీసుకుని హత్యాయత్నానికి పాల్పడ్డాడు. సెల్ఫీ తీసుకుంటానని నమ్మిం చి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. జగన్ మెడకు గురిపెట్టిన కత్తి అదృష్ట వశాత్తూ ఆయన ఎడమ చేతి జబ్బకు గుచ్చుకుంది. కత్తి లోతుగా దిగబడటంతో తొమ్మిది కుట్లు పడ్డాయి. ఆ క్షణం ప్రత్యక్షసాక్షులుగా జగన్ వెంట ఉన్న జిల్లా పార్టీ నేతలకు ఆ రోజు నుంచి కంటిమీద కునుకులేదు. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. జిల్లా ప్రజలైతే తమ అభిమాన నాయకుడిపై జరిగిన హత్యాయత్నానికి తల్లడిల్లిపోయారు. విషయం తెలియగానే పార్టీ శ్రేణులతో కలిసి వీధుల్లోకి వచ్చారు. రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహించారు. మరోవైపు జగన్ త్వరగా కోలుకోవాలని సర్వమత ప్రార్థనలు చేశారు. ప్రత్యేక పూజలు, యా గాలు, దాన ధర్మాలు నిర్వహించారు. జగన్పై హత్యాయత్నం వెనుక దాగిన కుట్రలను ఛేదిం చాలని, స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయిం చాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
ఆదినుంచీ అదే ఆదరణ
ఎస్ కోట నియోజకవర్గం నుంచి జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర మొదలుపెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లా ప్రజానీకం అడుగడుగునా నీరా జనాలు పలికారు. జిల్లాలోని ఎస్కోట, విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి మీదుగా సాలూరు నియోజకవర్గం వర కూ 26 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించిన జగన్ అనుకోని పరిస్థితుల్లో 17 రోజుల పాటు విరామం తీసుకోవాల్సి వచ్చింది. సాధారణ పరిస్థితుల్లో ఇన్ని రోజులు విరామం తీసుకుంటే మామూలుగానే ఉండేది. కానీ హత్యాయత్నం వల్ల గాయపడి వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకున్నారు. ఆయన ఎలా ఉన్నారోన నే ఆందోళన జిల్లా ప్రజల్లో ఎక్కువగా ఉంది. ఒక్కసారైనా జగన్ను చూస్తే తప్ప వారి మనసు కుటుటపడదు. అందుకే జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విశాఖ విమానాశ్రయానికి ఎదురెళ్లి జగన్కు స్వాగతం పలికారు. విజయనగరంలో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు జిల్లాలో స్వాగతం చెప్పారు. ఇలా పాయకపాడు వరకూ నేతలు జగన్ వెన్నంటి ఉన్నారు. తనపై ఇంతటి వాత్సల్యం చూపిస్తున్న పార్టీ శ్రేణులకు, అభిమానులకు అభివాదం చేస్తూ పాయకపాడుకు జగన్ చేరుకున్నారు. సోమవారం నుంచి పాదయాత్ర పునఃప్రారంభిస్తున్న జగన్కు పోలీస్శాఖ మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే జగన్కు దగ్గరగా వెళ్లేందుకు అనుమతినివ్వడంతో పాటు సామాన్య ప్రజలను కూడా ముందుగా తనిఖీ చేసి జగన్ను కలిసే ఏర్పాటు చేశారు.
తరలి వచ్చిన అభిమానులు
మక్కువ: ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదివారం రాత్రి 9.10 గంటలకు మక్కువ మండలం పాయకపాడు వద్ద ఏర్పాటు చేసిన బస వద్దకు చేరుకున్నారు. జగనన్న వస్తున్నారని తెలుసుకున్న మండల ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున శిబిరం వద్దకు చేరుకున్నారు. జననేత శిబిరం వద్దకు చేరుకోగానే, జై జగన్ అంటూ నినాదా లు చేశారు. జననేత వెంట మాజీ ఎంపీలు మి«థున్రెడ్డి, బాలశౌరి, విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, విజ యనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్రాజ్, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే తాన్నేటి వనిత, రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కౌరు శ్రీనివాస్, కొవ్వూరు పట్టణ అధ్యక్షుడు రుత్తల ఉదయ్భాస్కర్రావు, బొబ్బిలి మున్సిపల్ మాజీ చైర్మన్ ఇంటి గోపాలరావు, మక్కువ మండల పార్టీ నాయకులు మావుడి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
నేటి పాదయాత్ర సాగేదిలా...
వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చేపడుతున్న 295వ రోజు పాదయాత్ర వివరాలను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం వెల్లడించారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు సాలూరు నియోజకవర్గంలోని మక్కువ మండలంలో గల పాయకపాడువద్ద పాదయాత్ర ప్రారంభించి అదే మం డలంలోని సాయంత్రం 4 గంటలకు కొయ్యానపేట వరకు కొనసాగిస్తారని తెలిపారు. ఉదయం 7.30 గంటలకు పాయకపాడు వద్ద బయలు దేరి మేళపువలస, మక్కువ క్రాస్, ములక్కాయవలస క్రాస్, కాశీపట్నం క్రాస్ వరకు కొనసాగిస్తారని తెలిపారు. అక్కడి నుంచి మధ్యాహ్న విరా మం అనంతరం పాపయ్యవలస, కొయ్యానపేట వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. అక్కడే రాత్రి బస చేస్తారని ఆయన వెల్లడించారు.