ఆప్యాయంగా పలకరిస్తూ.. అండగా నిలుస్తూ..
అప్రతిహతంగా సాగుతున్న జననేత ప్రజాసంకల్ప యాత్ర
నేడు ఊలపల్లిలో ప్రారంభం కానున్న 212వ రోజు పాదయాత్ర
గొల్లల మామిడాడలో బహిరంగ సభ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సామాన్య జనాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ.. పెద్దవారిని గౌరవిస్తూ.. ఆపన్నులను దగ్గరకు తీసుకుని భరోసా ఇస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర జిల్లాలో ముందుకు సాగుతోంది. జననేతలో తొణికిసలాడే వ్యక్తిత్వమే సామాన్యుడికి ఆయనపై గురి పెంచుతోంది. తమ సమస్యలను జననేత ఓపికగా వింటున్న తీరు వారి విశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. అందుకే వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర రోజురోజుకూ జన హృదయాలకు దగ్గరవుతోంది. పల్లెపల్లెనా ఆత్మీయతను పంచుతోంది. అప్రతిహతంగా సాగుతున్న ప్రజాసంకల్ప యాత్ర 212వ రోజైన శనివారం ఊలపల్లి శివారు నుంచి ప్రారంభం కానుంది. ఆయన అడుగులో అడుగు వేసేందుకు జనాలు నిరీక్షిస్తున్నారు. నాలుగేళ్లుగా పడుతున్న కష్టాలను అభిమాన నేతకు వివరించి సాంత్వన పొందాలని, రాజన్న బిడ్డ వెంట నడవాలని ఆశగా చూస్తున్నారు. శనివారం ఉదయం 7.30 గంటలకు ప్రారంభమయ్యే జగన్ పాదయాత్ర బిక్కవోలు, గొల్లల మామిడాడ వరకూ సాగనుంది. అనంతరం గొల్లల మామిడాడలో భారీ బహిరంగ సభ జరగనుంది. దీనికి అశేషంగా తరలివచ్చే జనాన్ని ఉద్దేశించి జగన్మోహన్రెడ్డి ప్రసంగించనున్నారు.
సంబంధిత వార్తలు