సంకల్పానికి సాక్షి
తీవ్ర గాలుల్లోనూ అడుగులు వేసిన జగన్
నిర్విరామంగా 8 కిలోమీటర్ల మేరకు సాగిన యాత్ర
నేడు టెక్కలి నియోజకవర్గంలో ప్రవేశం
శ్రీకాకుళం, అరసవల్లి: మాట తప్పం.. మడం తిప్పం అనే ఆయన నైజం మరోసారి రుజువైంది. పెథాయ్ వంటి తుఫాన్ గాలులను సైతం లెక్కచేయకుండా పాదయాత్ర చేయడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి సాక్షిగా నిలిచింది. ప్రజాసంక ల్పయాత్ర సోమవారం నరసన్నపేట నియోజకవర్గంలో కొనసాగించారు. తుఫాన్ గాలులను సైతం లెక్కచేయకుండా జగన్ చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా సాగింది. కొందరు మహిళలు జగన్ను కలిసి ఆరోగ్యం జాగ్రత్త అంటూ చెప్పుకొచ్చారు. చిరుజల్లులు, చల్లటి గాలుల మధ్య నిర్విరామంగా 8 కిలోమీటర్ల మేరకు యాత్రను కొనసాగించారు.
పాదయాత్ర సాగిందిలా..
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారం ఉదయం జమ్ము నుంచి ప్రారంభమైన పాదయాత్ర నరసన్నపేట నియోజకవర్గంలో సాగింది. అడుగడుగునా వందలాది మంది జనం జగన్ను కలిసేందుకు పోటీపడ్డారు. తుపాన్ ప్రభావంగా గాలులొస్తున్నా రోడ్డు మీదే యువకులు, మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చి జగన్ను కలిసి సెల్ఫీలు దిగా రు. కొందరు బాధితులు తమ అవస్థలను జగన్కు విన్నవిం చుకున్నారు. యాత్రలో భాగంగా సోమవారం ఉదయం టెక్కలిపాడు క్రాస్, రావాడపేట, చిన్నదూగాం జంక్షన్, నారాయణవలస, రాణా జంక్షన్, లింగాలవలస వరకు నిర్విరామంగా సాగింది. ఈ క్రమంలో తమకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ బీసీ–ఎ జాబితా కులస్తులుగా పరిగణిం చాలని పొందర కుల సంఘ ప్రతినిధులు జగన్ను కోరారు. అలాగే రజకులు, ముస్లింలు కూడా కలిసి తమ వినతులను అందజేశారు. ప్రజాప్రయోజన వాజ్యాలను (పిల్) ఉన్నత న్యాయస్థానాలతో పాటు జిల్లా కోర్టుల్లోనూ స్వీకరించేలా చేయాలని హైకోర్టు న్యాయవాది సంపతిరావు సుధాకర్ కోరారు. అలాగే హార్టికల్చర్ ల్యాండ్ స్కేప్ మేనేజిమెంట్ కోర్సు చేసిన వారికి ఉద్యోగాలకు అర్హతగా నిర్ణయించడం లేదంటూ పలువురు బాధితులు జగన్కు విన్నవించారు. అలాగే తిత్లీ తుపాన్తో నష్ట పోయిన పంటకు పరిహారం ఇవ్వలేదని, టీడీపీ నేతలకు మద్దతుగా ఉన్నవాళ్లకే పరిహా రాలు ఇస్తున్నారని బాధిత రైతులు వాపోయారు.
పాదయాత్రలో సంఘీభావం ప్రకటించిన నేతలు
జగన్ నిర్వహించిన పాదయాత్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరె డ్డి, పిఎసి సభ్యుడు ధర్మాన కృష్ణదా స్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అ«ధ్యక్షుడు తమ్మినేని సీతారాం, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, పలాస నియోజకవర్గ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఎన్ని ధనంజయ, మామిడి శ్రీకాంత్, యువనేతలు ధర్మాన రామలింగం నాయుడు, ధర్మాన కృష్ణ చైతన్య, తమ్మినేని చిరంజీవి నాగ్ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రలో ప్రముఖ సినీ నటుడు కృష్ణుడు జగన్ను కలిసి, ఆయనతో కాసేపు నడుస్తూ.. దివంగత వైఎస్సార్ పెయింటింగ్ చిత్రపటాన్ని జగన్కు అందజేశారు.
నేడు టెక్కలి నియోజకవర్గంలోకి ప్రవేశం
జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ఆరు నియోజకవర్గాలను పూర్తి చేసుకుని మంగళవారం నాడు టెక్కలి నియోజకవర్గంలో ప్రవేశించనుంది. ఇది జిల్లాలో మరో కీలకమైన నియోజకవర్గం కావడంతో ఈ ప్రాంతంలో జగన్ పాదయాత్ర విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు తగు చర్యలు చేపడుతున్నారు. కోటబొమ్మాళి మండల పరిధిలో సౌదాం గ్రామ సరిహద్దులో ప్రవేశంతో టెక్కలి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభం కానుంది.