హోరెత్తిన జగన్నినాదం
జననేత కోసంబారులు తీరిన జనం
దగ్గరగా చూసేందుకు.. కరచాలనం చేసేందుకు..
సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డ నగరవాసులు
దారి పొడవునా కష్టాలు చెప్పుకున్న బాధితులు
నేనున్నానంటూ ధైర్యం చెబుతూ ముందుకు సాగిన జననేత
కొనసాగిన 261వ రోజు ప్రజా సంకల్పయాత్ర
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 261వ రోజు బుధవారం గ్రేటర్ విశాఖ పరిధిలోని విశాఖ తూర్పు నియోజకవర్గంలో సాగింది. విశాఖ తూర్పు సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్, నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, పార్లమెంట్ కో ఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణలతో పాటు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున తదితరులు వెంటరాగ జననేత పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర సాగిన దారి పొడవున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జననేతను చూసేందు కు తమ కష్టాలు చెప్పుకునేందుకు ప్రజలు ఉత్సాహం చూపారు. దీంతో పాదయాత్ర సాగే దారులన్నీ జనదారులయ్యాయి. ఆయన నడిచిన ప్రాంతాలన్నీ జై జగన్ నినాదాలతో హోరెత్తాయి.
ఆర్కే బీచ్రోడ్లోని లాసన్స్బే కాలనీ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఉషోదయ జంక్షన్, ఆదర్శనగర్, టీటీడీ కల్యాణ మండపం కూడలి, గిరిజన భవన్ కూడలి, ఎంవీపీ కాలనీ, వెంకోజీపాలెం, హనుమంతవాక జంక్షన్ మీదుగా చినగదిలి వరకు సాగింది. కోలాటాలు, తప్పెట గుళ్లు, గరగ నృత్యాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాలైన కొమ్ము, థింసా కళాకారుల ప్రదర్శనలతో పాదయాత్ర దారుల్లో పండగ వాతావరణం నెలకొంది.
పాదయాత్రలో ప్రారంభంలో మత్స్యకారులు జగన్ను కలసి తమ గోడు చెప్పుకున్నారు. మత్స్యకారుల సంప్రదాయ టోపీని జగన్కు బహూకరించారు. ఉషోదయ జంక్షన్కు చేరుకున్న జగన్కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. మనోహర్, నేత్ర దంపతుల పెళ్లిరోజు బుధవారం కావడం తో.. తమకు ప్రత్యక్ష దైవం మీరేనంటూ ఆశీర్వదించాలని జననేతను కలిశారు. జననేత ఆశీర్వచనాలు అందుకున్న వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దళితులపై ఏయూ ప్రొఫెసర్ డాక్టర్ ప్రేమానందం రచించిన సోషల్ స్ట్రక్చర్ ఫర్ దళిత్స్ అనే పుస్తకాన్ని జననేత ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీ వైద్య విభాగం ఆధ్వర్యంలో పేదలకు వైద్య సేవలందించే లక్ష్యంతో 100 మెగా వైద్య శిబిరాల నిర్వహణపై రూపొందించిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పోస్టర్ను జననేత ఆవిష్కరించారు. భోజన విరామం అనంతరం భారీ వర్షం కురుస్తున్నా.. లెక్కచేయక జననేత ముస్లింల ఆత్మీయ సదస్సుకు భారీ జనసందోహం మధ్య పాదయాత్రగా వెళ్లారు. సదస్సు అనంతరం సాయంత్రం 6.30 గంటలకు క్యూ–1 ఆస్పత్రి ఎదురుగా ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకున్నారు.
ప్రజా సంకల్ప పాదయాత్రలో రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, పాదయాత్ర ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, కొయ్య ప్రసాదరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త ఎం.వి.వి.సత్యనారాయణ, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరుదు కల్యాణి, విశాఖ నగర, జిల్లా సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, కె.కె.రాజు, తిప్పల నాగిరెడ్డి, యు.వి.కన్నబాబురాజు, పెట్ల ఉమాశంకర గణేష్, రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్, దంతులూరి దిలీప్కుమార్, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఐ.హెచ్.ఫరూఖీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు బర్కత్ ఆలీ, మహమ్మద్ ముజీబ్ఖాన్, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి, సత్తి మందారెడ్డి, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్, రిటైర్డ్ విజిలెన్స్ ఎస్పీ యజ్జల ప్రేమ్బాబు, టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కోడా సింహాద్రి, నగర యూత్ అధ్యక్షుడు కొండా రాజీవ్గాంధీ, విశాఖ పార్లమెంట్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బి.కాంతారావు, అరకు పార్లమెంట్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు తడబారిక సురేష్, నగర, జిల్లా మహిళా అధ్యక్షులు గరికిన గౌరి, పీలా వెంకటలక్ష్మి, డీసీసీబి మాజీ చైర్మన్ ఉప్పలపాటి సుకుమార్ వర్మ, రాష్ట్ర యూత్ విభాగం ప్రధాన కార్యదర్శి తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, ఎస్సీ సెల్ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు రెయ్యి వెంకటరమణ, నగర అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, జిల్లా నాయకులు చొక్కాకుల వెంకటరావు, పీలా ఉమారాణి, సుధాకర్ సీతన్న, కిరణ్రాజు తదితరులు పాల్గొన్నారు.
చిన్నారికి అన్నప్రాసన
సీతమ్మధారకు చెందిన రన్విత కీర్తన అనే చిన్నారికి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం చినగదిలి కూడలి వద్ద అన్నప్రసాన చేశారు. అభిమాన నేత తమ చిన్నారిని దగ్గరకు తీసుకుని, ఆప్యాయంగా అన్నం తినిపించడంతో పాప తల్లిదండ్రులు అమర్, వరలక్ష్మి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.