మహా’ జనం
జననేత రాకతో మురిసిన మహానగరం
ఘన స్వాగతం చెప్పేందుకు ఎగసిపడిన జనకెరటం
దారిపొడవునా కిలోమీటర్ల మేర కదంతొక్కిన ప్రభంజనం
ఒకేసారి తిరిగేలా 150కి పైగా సీలింగ్ ఫ్యాన్లతో తోరణాలు
సాక్షి, విశాఖపట్నం: అపూర్వం..అద్వితీయం..అమోఘం..జనహృదయ నేతకు మహానగరం ఎర్రతివాచీ పరిచింది. కనీవినీ ఎరుగని రీతిలో అఖండ స్వాగతం పలికింది. ఉవ్వెత్తన ఎగసిపడే కడలికెరటం ఉప్పొంగింది. పాదయాత్ర దారులన్నీ జనపరవళ్లు తొక్కాయి. జననేత పాదాలు నొవ్వకుండా రెడ్కార్పెట్ పరిచి..పూలు జల్లి వాటిపై నడిపించి గుండెల్లో దాచుకున్న వెలకట్టలేని ప్రేమాభిమానాలను చాటారు. ఇక ఆయన అడుగులో అడుగులేస్తూ కదం తొక్కేందుకు వేలాది జనం పోటెత్తింది.
ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శనివారం మహా విశాఖ నగరంలో అడుగుపెట్టింది. పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం నుంచి ప్రారంభమైన ఈ మహా పాదయాత్ర పెదనరవ, కోట నరవ మీదుగా కొత్తపాలెం వద్ద మహా విశాఖలోకి ప్రవేశించింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కొత్తపాలెం, భగత్సింగ్ నగర్, కార్వల్ నగర్, సాయి నగర్, అప్పలనరసయ్య కాలనీ, నాగేంద్ర కాలనీ, గణపతినగర్, శ్రీరామ్నగర్ల మీదుగా గోపాలపట్నం జెడ్పీ హైస్కూల్ వరకు జననేత పాదయాత్ర సాగింది.
జననేత రాకతో మహానగరం పరవశించిపోయింది. కొత్తపాలెం వద్ద మహా విశాఖ నగరంలోకి అడుగు పెట్టిన జనహృదయనేతకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయ సాయిరెడ్డి, పశ్చిమ కో ఆర్డినేటర్, నగర పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, పార్లమెంటు కో ఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ, నగర పరిధిలోని ఇతర కో ఆర్డినేటర్లు వంశీకృష్ణ శ్రీనివాస్, కేకే రాజు, తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, అక్కరమాని వెంకటరత్నంతో పాటు వేలాది మంది పార్టీ శ్రేణులు కొత్తపాలెం వద్ద జననేతకు అఖండ స్వాగతం పలికారు.
జననేతకు స్వాగతం పలుకుతూ కొత్తపాలెం వద్ద ఏర్పాటు చేసిన భారీ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జెర్రి పోతులపాలెం మొదలు గోపాలపట్నం వరకు వేలాది జనం జననేతవెంట కదంతొక్కారు. కో ఆర్డినేటర్ మళ్లతో పాటు 66వ వార్డు అధ్యక్షుడు దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో కొత్తపాలెం మొదలుకొని గోపాలపట్నం వరకు రహదారి పొడవునా రెడ్కార్పెట్ పరిచి పూలు జల్లి పూల తివాచీపై నడిపించారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వచనం పలికారు. మహిళలు బూడిద గుమ్మిడి కాయలతో దిష్టితీశారు. కొత్తపాలెం ముఖద్వారం వద్ద బాణసంచా కాల్పులతో హోరెత్తించారు.
అంతేకాకుండా ముఖద్వారం పక్కనే నవరత్నాల హామీల్లో ఒకటైన దశల వారీగా మద్య నిషేధం ప్రస్పుటించేలా మూడు మద్యం బాటిల్స్ నమూనాను ఏర్పాటు చేసి వాటిని ధ్వంసం చేశారు. 20మంది చిన్నారులు వైఎస్సార్ పార్టీ జెండా రంగులతో స్వాగతం పలికారు. మహిళలు కూడా పార్టీలోని మూడురంగుల జెండాలతో కూడిన చీరలను కట్టుని కవాతు నిర్వహించారు. సంప్రదాయ భారతీయ, కూచిపూడి కళాకారులు చేస్తూ స్వాగతం పలికారు. అలాగే దారిపొడవునా 150కు పైగా పార్టీ గుర్తయిన సీలింగ్ ఫ్యాన్లు ఒకేసారి తిరిగేలా ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మధ్యాహ్నం కోటనరవ నుంచి గోపాలపట్నం వరకు జనప్రవాహంతో రహదారికి జనసంద్రమైంది. రైల్వే అండర్ పాస్ వంతెనతో పాటు రైలు పట్టాలపై కూడా జనం వెల్లువలా తరలి వచ్చి స్వాగతం పలికారు.
సమస్యల మొర
పాదయాత్ర ప్రారంభంలో జెర్రిపోతులపాలెంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోగా ఎడాపెడా పన్నులు మాత్రం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిని టీడీపీ నాయకులు కబ్జా చేశారని వాటిని ఎలాగైనా తమకు ఇప్పించాలని జెర్రిపోతులపాలెం దళితులు జగన్కు మొరపెట్టుకున్నారు. జాతీయస్థాయిలో సంచలమైన దళిత మహిళను వివస్త్రను చేసిన ఘటనకు కారణమైన స్థలాన్ని వైఎస్ జగన్ పరిశీలించారు.
ఘటన జరిగినప్పుడు రూ.8లక్షలు పరిహారం ఇస్తామన్నారని, కానీ నేటికీ పూర్తిస్థాయి పరిహారం ఇవ్వలేదని వారు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. జెర్రిపోతుల పాలెంలో సర్వే నెం.80లో డి.ఫారం పట్టా భూములను పెందుర్తి ఎమ్మెల్యే అండదండలతో టీడీపీ నాయకులు కబ్జా చేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని, దళితుల భూముల్లో క్వారీలుఅక్రమ తవ్వకాలు సాగిస్తున్నారని బాధితులు జగన్ వద్ద తమ గోడు చెప్పుకున్నారు. లైసైన్సులు మంజూరు చేయాలని దస్తావేజు లేఖర్లు, నెలవారీ జీతాలు ఇచ్చేలా ఏర్పాటు చేయాలని విద్యుత్ మీటర్ రీడర్లు, ఉద్యోగాలకు భద్రత కల్పించాలని జీవీఎంసీ జలశుద్ధి సరఫరా కార్మికులు జగన్ను కలిసి విన్నవించుకున్నారు.
అదే విధంగా వేలిముద్రలు పడక పింఛన్లు ఇవ్వడం లేదని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పింఛన్లు ఆపేశారని వికలాంగులు వాపోయారు. ఇలా వందలాది ఫిర్యాదులు దారిపొడవునా వెల్లువెత్తాయి. తనకు ఎదురేగి స్వాగతం పలికి తమ కష్టాలు చెప్పుకున్న ప్రతి ఒక్కర్ని అక్కున చేర్చుకుని వారి కష్టాలు వింటూ వారి కన్నీళ్లు తుడుస్తూ ఆరు నెలలు ఓపిక పట్టండి..మనందరి ప్రభుత్వం వస్తుంది.. మీ కష్టాలన్నీ తిరిపోతాయంటూ వైఎస్ జగన్ ఇస్తున్న భరోసా బాధిత వర్గాలకు కొండంత స్థైర్యాన్ని ఇస్తోంది.
పాదయాత్రలో పాదయాత్ర ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మాజీ మంత్రి తమ్మినేని సీతారామ్, అరకు పార్లమెంట్ జిల్లా సమన్వయకర్త పరీక్షిత్రాజు, సమన్వయకర్తలు అన్నంరెడ్డి అదీప్రాజు, పెట్ల ఉమాశంకరగణేష్, ఎం.వి.రమణమూర్తిరాజు, కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, అక్కరమాని విజయనిర్మల, మేడా మురళి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు దాట్ల వెంకట అప్పల ప్రసాదరాజు, ప్రగడ నాగేశ్వరరావు, దంతులూరి దిలీప్కుమార్, తాడి విజయభాస్కరరెడ్డి, కె.ఎల్.ఎమ్.మోహనరావు, అరిమం డ వరప్రసాదరెడ్డి, కాకి నిర్మలారెడ్డి, ఎస్.రాజా రావు, జర్సింగ్ సూర్యనారాయణ, ప్రచారకమిటీ రాష్ట్ర అధ్యక్షుడు విజయచందర్, జిల్లా అధ్యక్షుడు బర్కత్ ఆలీ, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బైలపూడి భగవాన్ జైరామ్, పక్కి దివాకర్, సీఈసీ సభ్యులు కాకర్లపూడి శ్రీనివాసరాజు, పైల శ్రీనివా సరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఉప్పలపాటి సుకుమార్వర్మ, వైఎస్ చైర్మన్ సుంకర గిరిబాబు, రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, రాష్ట్ర యూత్ విభాగం ప్రధాన కార్యదర్శులు గుడ్ల పోలిరెడ్డి, మాసిపోగు రాజు, మాజీ ఎమ్మెల్యే దేముడు కుమార్తె గొడ్డేట మాధవి, టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కోడ సింహాద్రి, అరకు పార్లమెంట్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు తడబారిక సురేష్కుమార్, కార్మికనాయకుడు రాపర్తి మాధవరావు, జిల్లా అధికార ప్రతినిధులు మళ్ల బుల్లిబాబు, నగర, జిల్లా మహిళా అధ్యక్షులు గరికిన గౌరి, పీలా వెంకటలక్ష్మి, శ్రీదేవివర్మ, పీలా ఉమారాణి, జిల్లా నాయకులు చొక్కాకుల వెంకటరావు, బోకం శ్రీనివాస్, ఈగలపాటి యువశ్రీ, కంటుబోతు రాంబాబు, గొర్లె అప్పలస్వామినాయుడు, మార్టుపూడి పరదేశి, మళ్ల నూక అప్పారావు, మళ్ల నాగేశ్వరరావు, గండ్రెడ్డి మహలక్ష్మినాయుడు, ఇల్లపు ప్రసాద్, చిరిక దేవుడు, వేగి శ్రీరామమూర్తి, జి.రోజారాణి, ఎం.రాజేశ్వరి, నగర యూత్ అధ్యక్షుడు కొండా రాజీవ్గాంధీ, విశాఖ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు బి.కాంతారావు, జీవీఎంసీ వార్డు అధ్యక్షులు దాడి నూకరాజు, ఎల్.బి.నాయుడు, దాసరి రాజు, దొడ్డి కిరణ్ రాజంపేట నుంచి చొప్పా గంగిరెడ్డి, పొల శ్రీనివాసరెడ్డి, తంబెళ్ల దుర్గారెడ్డి, చొప్పా ఎల్లారెడ్డి, అనంతపురం నుంచి పసుపులేటి బాలకృష్ణారెడ్డి, వెన్నపూస రామచంద్రారెడ్డి, రైతు విభాగం కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్, గుంటూరు సేవాదళ్ అధ్యక్షుడు కొత్త చిన్నపరెడ్డి, యూత్ ప్రధానకార్యదర్శి వింత శివనాగరెడ్డి, దర్శి నుంచి ఐ.భాస్కరరెడ్డి, నంద్యాల నుంచి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నాగ్ ఫ్యాన్స్ మద్దతు మీకే..
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర త్వరలో 3వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శనివారం ఏపీ స్టేట్వైడ్ అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఫ్యాన్స్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు బి.రాము యాదవ్, కార్యదర్శి కె.శ్రీనివాస్, గౌరవ అద్యక్షులు నవీన్ప్రసాద్, రమణారెడ్డి, జె.వి శ్రీనివాసరావు, రామచంద్రారెడ్డి తదితరులు శనివారం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కోటనరవలో జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు నాగార్జున అభిమానులను ఆకట్టుకున్నాయన్నారు. రానున్న ఎన్నికలలో తాము వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపునకు బయట ప్రచారం చేయనున్నట్టు వారు ప్రకటించారు.
చిన్నారికి అక్షరాభ్యాసం
అరకుకు చెందిన చిన్నారి జాన్ హైడ్కు శనివారం సాయంత్రం గోపాలపట్నం జడ్పీహైస్కూల్ ఆవరణలో జననేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి అక్షరాభ్యాసం చేయించారు. అర కు పార్లమెంట్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు తడబారిక సురేష్ కుమార్ మాట్లాడు తూ తన మేనల్లుడుకు జగనన్న అక్షరాభ్యా సం చేయించడం ఆనందంగా ఉందన్నారు.