చోడవరమంత సంబరం
జగన్ పాదయాత్ర, సభలతో పరవశించిన పట్టణం.. పల్లెలు
ఎటు చూసినా పండుగ వాతావరణం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : చోడవరమంతా సంబరమైంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం చోడవరంలో నిర్వహించిన పాదయాత్ర, బహిరంగ సభలకు జనం అడుగడుగునా పోటెత్తారు. పాదయాత్ర దారుల్లో నాలుగు కిలోమీటర్ల మేర జనమే ఉ న్నారంటే ఏ స్థాయిలో పాదయాత్ర జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక బహిరంగ సభ జరిగిన చోడవరం కొత్తూరు జంక్షన్ నలుచెరుగులా ఎటు చూసినా జనమే కన్పించారు.
బహిరంగ సభలో జగన్ స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేతో సహా టీడీపీ నేతల అవినీతిని ఎండగడుతూ చేసిన ప్రసంగానికి ప్రజలు సంఘీభావంగా హర్షధ్వానాలు చేశారు. చంద్రబాబు నాయుడు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టు కొన్నారని.. మొత్తం 14 మంది ఎమ్మెల్యేలతో ఏమైనా అభివృద్ధి చేశారా అని జగన్ ప్రశ్నించగా.. జనం లేదు లేదు అని బిగ్గరగా అరుస్తూ చేతులూపుతూ సమాధానమిచ్చారు. చోడవరం నియోజకవర్గానికి ఏమైనా చేశారా అని ప్రశ్నించగా అందుకు కూడా జనం లేదు లేదంటూనే సమాధానం ఇచ్చారు. టీడీపీ నేతలు మట్టిని, ఇసుకను కూడా వదలకుండా సర్వం దోచేస్తున్నారని తీవ్ర స్థాయిలో జగన్ ధ్వజమెత్తారు.
అవినీతికి కేరాఫ్ అడ్రస్: చోడవరం నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్లలో రూ.54 కోట్లు విలువ చేసే 136 ఎకరాలను టీడీపీ నాయకులు ఆక్రమించుకున్నారు.. రోలుగుంట మండలం జేపీ అగ్రహారంలో కొన్ని దశాబ్దాలుగా పేద రైతులు దున్నుకుంటున్న 412 ఎకరాల భూమిని నకిలీ పవరాఫ్ పట్టాలు సృష్టించి స్వాహా చేయడానికి స్థానిక ఎమ్మెల్యే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని బాధిత రైతులు తమ దృష్టికి తెచ్చారని జగన్ అన్నారు. గజపతినగరం, జుత్తాడ, గవరవరం, గౌరీపట్నం, మంగళా పురం ఇసుక రీచ్లలో ఏకంగా పొక్లైన్లు పెట్టి వేలాది లారీల ఇసుకను అక్రమంగా ప్రతీరోజూ తరలించుకుపోతున్నారని ఆరోపించారు. ఇక్కడ 2 యూనిట్ల ఇసుకను ఏకంగా రూ.16 వేలకు అమ్ముతూ వేల కోట్లు దోచేస్తున్నారన్నారు.
తోటకూరపాలెం, గుడ్డిప, దొండపూడి, కొట్నాపల్లి తదిత చోట్ల ఇష్టమొచ్చినట్టు మైనింగ్ చేస్తుంటే ఇక్కడ ఎమ్మెల్యే పట్టించుకోకపోగా ఏకంగా లంచాలు తీసుకొని పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. నర్సాపురం, లక్ష్మీపురం,పెదపూడి, మేడివాడ, కోమళ్లపూడి చెరువుల్లో నీరు–చెట్టు కింద పనులు చేయకపోయినా చేసినట్టు చూపించి బిల్లులు పెట్టి ఏకంగా రూ.36 కోట్లు స్వాహా చేశారని ఇక్కడ ప్రజలు తనకు తెలిపారన్నారు. బుచ్చెయ్యపేట మండలం ఐతంపూడికి చెందిన శ్రీను ఒక ప్రమాదంలో రెండు కాళ్లూ చేతులు కోల్పోయి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా రాకపోవడంతో ఎండీఓ కార్యాలయం వద్ద ఆత్మహత్యా యత్నం చేసుకుంటేనే తప్పా పింఛన్ ఇవ్వలేని దౌర్భాగ్యస్థితిలో ఉందని ఆ బాధితుని బంధువులు తన వద్ద వాపోయారని జగన్ పేర్కొన్నారు.
25 వేలమంది ఆధారపడి ఉన్న చోడవరం సుగర్ ఫ్యాక్టరీని ఏకంగా రూ.45 కోట్ల నష్టాల్లోకి చంద్రబాబు ప్రభుత్వం నెట్టేసిందని జగన్ ధ్వజమెత్తారు. ఫ్యాక్టరీలో తడిసిన పంచదార బస్తాలను ఎలాంటి టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు బినామీ సుజనాచౌదరికి మార్కెట్ ధర రూ.3 వేలుండగా పదకొండు వందలకే కట్టపెట్టారని ఆరోపించారు. మార్కెట్లో మొలాసిస్ ధర రూ.6 వేలు పలుకుతుంటే, తన బినామీలకు రూ.2,700కే కట్టబెట్టారని, అందుకే ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందన్నారు. మొలాసిస్ వల్లనే ఈ మూడేళ్లలో ఫ్యాక్టరీ రూ.20 కోట్లు నష్టపోయిందని రైతులు చెప్పారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే విశాఖ జిల్లాలో మూతపడ్డ అన్ని చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తామని, నష్టాల్లో ఉన్న వాటిని అభివృద్ధి బాట పట్టిస్తామని జగన్ భరోసా ఇచ్చారు.
మాడుగుల నియోజకవర్గంలోకి ప్రజాసంకల్పయాత్ర
నేటి ఉదయం 7.30 గంటలకు అన్నవరం శివారు నుంచి ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 252వ రోజు ఆదివారం చోడవరం నియోజక వర్గం నుంచి మాడుగుల నియోజకవర్గంలోకి ప్రవేశించనుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రొగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం వెల్లడించారు. అన్నవరం శివారున ఏర్పాటుచేసిన రాత్రి బస ప్రాంతం నుంచి ఆదివారం ఉదయం ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న పాదయాత్ర రేవళ్లు, ఖండేపల్లి క్రాస్, గౌరవవరం, జి.జగన్నాథపురం క్రాస్, వేచలం క్రాస్ (చీకటితోట) మీదుగా ములకలాపల్లి వరకు సాగనుందన్నారు. చోడవరం మీదుగా మాడుగుల నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న పాదయాత్రలో వేలాదిగా ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని రఘురాం పిలుపు నిచ్చారు.