ఈ వర్షం సాక్షిగా...
భీమిలి నియోజకవర్గంలో అడుగిడిన జననేత
దారిపొడవునాబ్రహ్మరథం పట్టిన ప్రజలు
సాక్షి, విశాఖపట్నం: ఉదయం భానుడు..మధ్యాహ్నం వరుణుడు ప్రతాపం చూపినా లెక్కచేయలేదు. ఆకాశమే హద్దుగా హృదయాంతరాల నుంచి కురుస్తున్న ప్రజాభిమాన జల్లులోతడిసి ముద్దవుతున్న జననేతకు మండు టెండ..కుండపోత వర్షం కూడా మలయమరుతంలా అన్పించాయి. ఎండా. వానా లెక్కచేయకుండా తన వెంట అడుగులో అడుగు వేస్తూ కదం తొక్కుతున్న ప్రజల కోసం ఉరిమే ఉత్సాహంతో జననేత ముందుకు సాగారు.
టీడీపీ దుష్ట పాలనపై సమర భేరి మోగిస్తూ పీడిత, తాడిత ప్రజలకు తానున్నానని అండగా నిలుస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర మహా విశాఖలో అప్రతి హాతంగా సాగుతోంది. 262వ రోజు పాదయాత్ర విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రాంతలమీదుగా సాగగా... మధ్యాహ్నం భీమిలి నియోజక వర్గంలోకి అడుగుపెట్టిన కొద్దిసేపటికే వరుణుడు వర్షంతో ఆహ్వానం పలికాడు. జోరు వర్షంలో సైతం జననేత వెంటే జనం కదంతొక్కారు. జననేతను కలిసిన మధురజ్ఞాపకంతో మదినిండా దాచుకునేందుకు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ల కోసం పోటీపడ్డారు.
పాదయాత్ర సాగిందిలా..
ప్రజాసంకల్పయాత్ర 262వ రోజు శనివారం ఉదయం 8.45 గంటలకు విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని చినగదిలి క్యూ–1 ఆస్పత్రి నుంచి ప్రారంభమైంది. మండుటెండలో తన కోసం బారులు తీరిన మహిళలు, చిన్నారులను పలుకరిస్తూ వారితో సెల్ఫీలు తీసుకుంటూ వారి కష్టాలు వింటూ ముందుకు కదిలారు. ముడసర్లోవ, రామకృష్ణాపురం, సెంట్రల్ జైలు, శ్రీకృష్ణాపురం,పైనాపిల్కాలనీ, దారపాలెంవరకుసాగగా, మధ్యాహ్నం అడవివరం, అడవివరం జంక్షన్, దారపాలెం వద్ద భోజనానికి ఆగారు. మధ్యాహ్నం ధారపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర జోరు వర్షంలోనే అడవివరం, లండగరువు క్రాస్, బైరవవాక మెయిన్ రోడ్ మీదుగా తిరిగి పెందుర్తి మండలం దువ్వుపాలెం వరకుసాగింది.
సమస్యలు వింటూ..భరోసానిస్తూ..
భైరవవాకవద్ద పెద్ద సంఖ్యలో న్యాయవాదులు జననేతను కలిసి విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఏఎంజీ వాలీ వద్ద ప్రేమ లోహియా లెప్రసీ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో ఆ వర్షంలో తడిసి ముద్దవుతూనే ఎదురు చూడడాన్ని గమనించిన జననేత వారిని ఏమాత్రం నిరుత్సాహపర్చకుండా వారి కష్టాలు విన్నారు. సింహాచలం భూ సమస్య పరిష్కరించాలని 72వ వార్డుకు చెందిన బాధితులు, ఉపాధి కరువై జీవనోపాధి లేకుండా పోయిందని అసంఘటిత కార్మికులు, తమకు ఏ పథకాలు వర్తించడం లేదని రజకులు ఇలా వివిధ వర్గాల ప్రజలు జననేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.
పాదయాత్రలో వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, పాదయాత్ర టూర్ ప్రొగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, శాసనసభ పక్ష ఉపనాయకుడు బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు, సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, అక్కరమాని విజయనిర్మల, అన్నంరెడ్డి అదీప్రాజు, కేకే రాజు, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, పెట్ల ఉమాశంకర్ గణేష్, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, రాజోలు సమన్వయకర్త వేగిరాజు సోమరాజు, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్రాజు, సీనియర్ నాయకుడు కాకర్లపూడి వరహాలరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్రెడ్డి, పార్టీ బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సత్తి మందారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దాట్ల వెంకట అప్పల ప్రసాదరాజు, రాష్ట్ర అదనపు కార్యదర్శులు పక్కి దివాకర్, రవిరెడ్డి, భీమిలి అర్బన్, రూరల్ అధ్యక్షుడు అక్కరమాని వెంకటరావు, బోని బంగారునాయుడు, నగర మహిళ అధ్యక్షురాలు గరికిన గౌరి, నగర ఎస్సీసెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడు బి.కాంతారావు, డీసీసీబీ మాజీ ఉపాధ్యక్షుడు సుంకర గిరిబాబు, జిల్లా అధికార ప్రతినిధి ఎస్.కరుణాకరరెడ్డి, జిల్లా నాయకులు జాన్ వెస్లీ, పీలా ఉమారాణి, వెంపాడ శ్రీనివాసరెడ్డి, కిరణ్రాజు, దాసరి రాజు, నడింపల్లి రామరాజు పాల్గొన్నారు.
అడుగుపెట్టిన ప్రతి చోటా వర్షం స్వాగతం
జననేత రాకతో జిల్లాలో వరుణుడు ప్రేమజల్లు కురిపిస్తూనే ఉన్నాడు. సంకల్పయాత్ర ప్రారంభమైన నర్సీపట్నం నియోజకవర్గంలో తొలి రోజు వర్షం కురియగా..పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పెందుర్తి, విశాఖ నగరంలో కూడా వర్షం కురిసింది. శనివారం మధ్యాహ్నం వరకూ భారీగా ఎండ కాయగా..జననేత జగన్ భీమిలి నియోజకవర్గంలో అడుగుపెట్టగానే భారీ వర్షం కురిసింది. ఇలా జగన్ అడుగుపెట్టిన ప్రతి నియోజకవర్గంలో వర్షం కురుస్తూ ఆహ్వానం పలకడం విశేషం.
జగన్కు వీజేఎఫ్ జ్ఞాపిక
వీజేఎఫ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి జ్ఞాపిక అందించారు. ఈ సందర్భంగా ఆయన చేపడుతున్న ప్రజాసంకల్ప పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. జగన్ను కలిసిన వారిలో వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఆర్.ఎస్.దుర్గారావు, సహాయ కార్యదర్శి డి.రవికుమార్, ఉపాధ్యక్షుడు నాగరాజు పట్నాయక్, సభ్యులు ఎం.ఎస్.ఆర్.ప్రసాద్, పి.దివాకర్, ఇ.ఈశ్వరరావు, వరలక్ష్మి, డి.గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.