ఆంక్షలు.. అడ్డంకులు
మహిళా సదస్సును అడ్డుకునేందుకు సర్కారు యత్నం
పోలీసుల వలయాన్ని ఛేదించిన అక్కాచెల్లెమ్మలు
ధర్నా చేసి మరీ సదస్సుకు వచ్చిన వైనం
జిల్లాలో ఆరో రోజు 13.5 కి.మీ. నడిచిన వైఎస్ జగన్
డోన్ నియోజకవర్గంలోకి ప్రవేశించిన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రజా సంకల్ప యాత్ర..వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బృహత్తర కార్యక్రమం. స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలు వినడం..వారి సమస్యలు తెలుసుకోవడం.. సంక్షేమ పథకాలు అందుతున్నాయో, లేదో ఆరా తీయడం..ఈ కార్యక్రమ ఉద్దేశం. పాదయాత్ర ద్వారా పల్లెపల్లె తిరుగుతూ..పట్టణాల్లో పర్యటిస్తూ వంచనకు గురైన సామాన్యులకు భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు ప్రతిపక్ష నేతకు నీరాజనాలు పలుకున్నారు.
తమ సమస్యలు విన్నవించి..మీరే సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు వెళ్లొద్దంటూ పోలీసులతో బెదిరింపులకు దిగుతోంది. పాదయాత్ర జరిగే రహదారిలో తిరగొద్దంటూ ఆంక్షలూ విధిస్తోంది. బనగానపల్లె మండలం హుస్సేనాపురం సమీపంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సుకూ ఇలాంటి అడ్డంకులనే సృష్టించింది. సదస్సుకు అనుమతి లేదనే సాకుతో స్వచ్ఛందంగా తరలివస్తున్న మహిళలను బనగానపల్లె శివారులో పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ పోలీసులు అడ్డుకున్న చోటే మహిళలు ధర్నాకు దిగి మరీ సదస్సుకు తరలివచ్చారు. పనులు మానుకుని అభిమాన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వస్తున్న తమను అడ్డుకోవడం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు.
క్వారీ కార్మికులకు వైఎస్సార్ బీమా
ప్రజాసంకల్ప యాత్ర జిల్లాలో ఆరో రోజు పూర్తయింది. సోమవారం మహిళలతో పాటు క్వారీలో పనిచేస్తున్న కార్మికులతో జననేత సంభాషించారు. ఈ సందర్భంగా మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. ఇక క్వారీ కార్మికులైతే తమకు ప్రమాద బీమా పథకం వర్తించడం లేదని వాపోయారు. అధికారంలోకి వస్తే వైఎస్సార్ బీమా పేరుతో మంచి పథకం తీసుకొద్దామని వారికి వైస్ జగన్ భరోసానిచ్చారు. మొత్తం మీద ఆరో రోజు పాదయాత్ర ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు 13.5 కిలోమీటర్ల మేర సాగింది. జిల్లాలో మొత్తం ఆరు రోజుల్లో జననేత 88.5 కిలోమీటర్లు నడిచారు.
ఘనంగా వీడ్కోలు...స్వాగతం
ప్రజాసంకల్ప యాత్ర సోమవారం నాటికి ఆళ్లగడ్డ, బనగానపల్లె నియోజకవర్గాల్లో పూర్తయింది. ఆరోరోజైన సోమవారం బనగానపల్లె నియోజకవర్గం ముగించుకుని డోన్ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా అటు బనగానపల్లె నియోజకవర్గ ప్రజలు ఘనంగా వీడ్కోలు పలకగా..ఇటు డోన్ నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆళ్లగడ్డ, బనగానపల్లె నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు ప్రతిపక్ష నేత దృష్టికి వచ్చాయి. వాటి పరిష్కారానికి హామీలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే ప్రధానంగా రాజోలి, జోళదరాశి రిజర్వాయర్లను నిర్మిస్తానని చెప్పారు. శనగకు గిట్టుబాటు ధర కల్పిస్తామని రైతులకు ధీమానిచ్చారు.
యాత్ర సాగిందిలా..
జిల్లాలో ఆరో రోజు పాదయాత్ర బనగానపల్లె నియోజకవర్గ కేంద్రం నుంచి ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 10 గంటల పాటు 13.5 కిలోమీటర్ల దూరం కొనసాగింది. ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్లకార్డును ప్రదర్శించి పాదయాత్ర సాగించడం ఆకట్టుకుంది. బనగానపల్లె నుంచి బత్తులూరుపాడు, య నకండ్ల, హుస్సేనాపురం, పలుకూ రు క్రాస్, గోవిందిన్నె మీదుగా గోర్లగుట్ట వరకు సాగింది. సోమవారం.. బనగానపల్లె నియోజకవర్గం లో పాదయాత్ర ముగిసి డోన్ నియోజకవర్గంలోని బేతంచెర్ల మం డలంలోకి ప్రవేశించింది. మంగళవారం బేతంచెర్ల మండలంలోనే కొనసాగనుంది.
పాదయాత్రలో పాల్గొన్న నేతలు..
నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు శిల్పా చక్రపాణి రెడ్డి, బీవై రామయ్య, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, సాయిప్రసాద్రెడ్డి, బాలనాగిరెడ్డి, గౌరు చరిత, ఆర్కె రోజా, జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, బనగానపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్ కాటసాని రామిరెడ్డి, పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీదేవి, పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, గుండం సూరప్రకాష్ రెడ్డి, పోచా శీలారెడ్డి, వంగాల పరమేశ్వరరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, పీఆర్ వెంకటేశ్వరరెడ్డి, డాక్టర్ మధుసూదన్, సురేందర్ రెడ్డి, రాజశేఖర్, శ్రీధర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కర్నాటి పుల్లారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మహిళా విభాగం నేతలు సలోమి, వంగపండు ఉష, సులోచన, శశికళారెడ్డి తదితరులు పాల్గొన్నారు.