ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నా..

ys jagan mohan reddy mahila sabha in atmakur - Sakshi

మహిళా సదస్సులో పలువురి ఆవేదన 

ఆత్మకూరు: తమను ప్రభుత్వం ఏమాత్రమూ ఆదుకోవడం లేదని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారం బనగానపల్లె మండలం హుస్సేనాపురం సమీపంలో మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

చదువు మానుకోవాల్సి వచ్చింది 
నా పేరు సత్య (ఊరిపేరు చెప్పలేదు). ఇంటర్‌ వరకు చదువుకున్నా. ఇంటర్‌లో ఒక సంవత్సరం స్కాలర్‌షిప్‌ ఇచ్చారు. ఇంకో ఏడాది ఇవ్వలేదు. దీనికితోడు కుటుంబ ఆర్థిక పరిస్థితి  బాగోలేకపోవడంతో చదువు మానుకోవాల్సి వచ్చింది. స్కాలర్‌షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇస్తే ఉన్నత చదువులు చదువుకుంటానన్నా. 

జగన్‌ : మన ప్రభుత్వం వస్తే స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌ మంజూరు చేస్తాం తల్లీ. పేద విద్యార్థుల ఉన్నత చదువుకు తోడ్పాటునిస్తామమ్మా. 

మా అమ్మ ఉద్యోగం తీసేశారన్నా..
(ఈమె పేరు, చిరునామా చెప్పలేదు) 
మా అమ్మ కస్తూరిబా హైస్కూల్‌లో అటెండర్‌గా పని చేసే ది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలగించారన్నా. 

జగన్‌ : ఈ ప్రభుత్వంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పరిస్థితి అంతా ఇలాగే ఉందమ్మా. ప్రతి మండలంలో మోడల్‌ స్కూల్‌ నిర్మించాలని, అన్ని వసతులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. అయితే.. ఇక్కడ మోడల్‌ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. వారు నా దగ్గరకు వచ్చి సమస్య చెప్పుకున్నారు. ఇలాగైతే వారు ఎలా చదువులు చెబుతారు? స్కూల్‌ ఎలా నడుపుతారు? వారితో పాటు 108, 104 వారికి కూడా మూడునెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పరిస్థితి అందరిదీ ఇలాగే ఉంది. మన ప్రభుత్వం వచ్చాక సమస్యలు పరిష్కరిస్తాం. 

బ్యాంకులో వడ్డీ అడుగుతున్నారన్నా.. 
మాది వెంకటాపురం(పేరు చెప్పలేదు). పొదుపు సంఘం ద్వారా రూ.40 వేలు తీసుకున్నాం. బ్యాంకులో రూ.3వేలు వేశామని చెబుతున్నారు. అది వేశారో, లేదో కూడా తెలియడంలేదు. 
మరోవైపు బ్యాంకులో వడ్డీ అడుగుతున్నారన్నా. 

జగన్‌ : ఈ ప్రభుత్వంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉందమ్మా. పొదుపు రుణాలు మాఫీ చేయకపోగా.. వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంది తల్లీ!  

చక్రవడ్డీ విధిస్తున్నారు...సబియా (ఊరి పేరు చెప్పలేదు) 
సార్‌.. మనస్సాక్షిగా చెబుతున్నా. చంద్రబాబు పాలనలో పొదుపు రుణాలపై చక్రవడ్డీ కూడా వేస్తున్నారు. 

జగన్‌ : రూ.10వేలు ఇస్తానన్నాడు కదమ్మా.. ఇవ్వలేదా? 

సబియా : సార్‌.. రూ.10 వేలలో రూ.6వేలు వచ్చాయన్నారు కానీ తీసుకున్న రుణాలకు వడ్డీపై వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా పొదుపు మహిళలం ఇబ్బంది పడుతున్నాం. 

జగన్‌ :  మన ప్రభుత్వం వచ్చాక పొదుపు రుణాలు ఎంత ఉంటాయో అంతే మొత్తాన్ని నాలుగు విడతలుగా నేరుగా మీకే అందజేస్తాం తల్లీ. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top