స్టూడెంట్స్ ఒలింపిక్స్ విజేతకు రూ.5 లక్షలు ప్రకటించిన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: శ్రీలంకలో జరిగిన స్టూడెంట్స్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన కృష్ణా జిల్లా విద్యార్థి వీర్ల మహేష్ బాబుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదు లక్షల రూపాయల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. విజయవాడలో జరిగిన పార్టీ బీసీ సదస్సులో తనను కలిసిన వీర్ల మహేష్ బాబును వైఎస్ జగన్ అభినందించారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహేష్ బాబుకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, అన్ని విధాలా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు.
కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కుడేరు గ్రామానికి చెందిన వెంకట శ్రీనివాస్, శ్రీలక్ష్మీల కుమారుడు వీర్ల మహేష్ బాబు. రైతు కుటుంబానికి చెందిన అతను ప్రస్తుతం నరసాపురంలోని ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. డిస్కస్ త్రో, కబడ్డి క్రీడలలో రాణిస్తూ.. జిల్లా, రాష్ట్ర స్థాయిలలోనే కాక జాతీయ స్థాయిలో అనేక బహుమతులు సాధించాడు.
ఈ ఏడాది జులైలో శ్రీలంకలో జరిగిన స్టూడెంట్స్ ఒలింపిక్స్ క్రీడల్లో.. డిస్కస్ త్రో విభాగంలో మహేష్ బాబు గోల్డ్ మెడల్ సాధించాడు. మహేష్ బాబు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్ జగన్ అభిలషించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ వైఎస్ జగన్ తనకు ప్రోత్సాహక బహుమతి ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అన్నారు. వీర్ల మహేశ్బాబు వెంట వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కే. పార్థసారథి ఉన్నారు.