ప్రజాసంకల్పయాత్రలో మైలురాయి
సాక్షి, కర్నూలు : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 100 కిలోమీటర్ల మైలురాయి చేరింది. కర్నూలు జిల్లా చాగలమర్రి దగ్గర ఆయన పాదయాత్ర 100 కిలో మీటర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్కు చాగలమర్రి వద్ద గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. పూల వర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు. వంద కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా జగన్...గొడిగనూరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
నవంబర్ 6న ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర ఏడు రోజులపాటు వైఎస్ఆర్ జిల్లాలో కొనసాగింది. వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర పూర్తి చేశారు. వైఎస్ఆర్ జిల్లాలో జగన్ 93.8 కిలో మీటర్లు నడిచారు. ప్రజాసంకల్పయాత్రలో 8వ రోజు అనగా ఇవాళ ఉదయం చాగలమర్రి మీదుగా వైఎస్ జగన్.. కర్నూలు జిల్లాలో అడుగుపెట్టారు. కాగా వైఎస్ఆర్ జిల్లాలో ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర...శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ కొనసాగనుంది.
సంబంధిత వార్తలు