'పులివెందులకు నీటి కష్టాలు తీర్చండి'
సాక్షి, అనంతపురం: పులివెందులకు తాగు, సాగునీటి కష్టాలు తీర్చాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి కోరారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ గోపాల్రెడ్డితో కలిసి బుధవారం ఆయన తుంగభద్ర నీటి సలహా మండలి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిత్రావతి రిజార్వాయర్ పూర్తిగా ఎండిపోయిందని తెలిపారు. పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో ఎండుతున్న పండ్లతోటలను కాపాడాలని కోరారు.
చంద్రబాబు ప్రభుత్వానికి స్పష్టమైన నీటి ప్రణాళిక లేదని ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నీటి వాటాలను తీసుకురావడంలో చంద్రబాబు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఆల్మట్టి నుంచి ఇతర రిజర్వాయర్లకు నీటిని కర్ణాటక తరలించుకుపోయిందన్నారు. హంద్రీనీవాను సీఎం, మంత్రులు ప్రచారానికే ఉపయోగిస్తున్నారని.. రైతులకు ఎలాంటి ప్రయోజనం చేరలేదని అన్నారు.