పుట్టినరోజు నాడే..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు/ తడ: పుట్టినరోజుని స్నేహితులతో కలిసి చేసుకోవాలనుకున్నాడు ఆ యువకుడు. ఇంతలోనే విధి చిన్నచూపు చూసింది. కాంక్రీట్ మిక్సర్ లారీ ఆ యువకుడిని బలిగొంది. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జాతీయ రహదారిపై శ్రీసిటీ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని బీవీపాళెం గ్రామానికి చెందిన బాబు సయ్యద్ (16) అనే యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. బీవీపాళెంకు చెందిన బాబు అనే వ్యక్తి తమిళనాడులోని ఆరంబాకంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.
అతనికి సయ్యద్ ఏకైక కుమారుడు. బాబు ఉదయం హోటళ్లకు చికెన్ సరఫరా చేసి సాయంత్రం నగదు వసూలు చేస్తుంటాడు. మంగళవారం నూతన సంవత్స రం సందర్భంగా షాపులో వ్యాపారం ఎక్కువగా ఉంది. దీంతో కుమారుడు సయ్యద్ని కలెక్షన్ కోసం పంపాడు. పైగా మంగళవారం సయ్యద్ పుట్టినరోజు కూడా కావడంతో తడలోని మిత్రులను కూడా కలవొచ్చని ఆసక్తిగా తండ్రి బైక్పై బయలుదేరాడు. తడకు కొద్దిదూరంలోకి వచ్చిన సయ్యద్ని శ్రీసిటీ సమీపంలో బాలఏసు పుణ్యక్షేత్రం ఎదుట వెనుకనుంచి కాంక్రీట్ మిక్సర్ లారీ వేగంగా ఢీకొంది.
ఈ ప్రమాదంలో అదుపుతప్పిన బైక్ కిందపడి లారీ ముందు చక్రాల కిందకు చేరుకుంది. లారీ బైక్ను ఈడ్చుకెళ్లి డివైడర్ని ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో సయ్యద్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందా డు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న తడ ఎస్సై దాసరి వెంకటేశ్వరావు సిబ్బం దితో కలిసి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఘట నా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పుట్టినరోజును కుటుంబసభ్యులు, మిత్రులతో సంతోషంగా గడపాల్సిన ఒక్కగానొక్క బిడ్డ తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.