జనహితునికి జేజేలు
జనసంద్రమైన కాకినాడ రహదారులు
దిగ్విజయంగా సాగిన సంకల్ప యాత్ర
కష్టాలు వింటూ అండగా ఉంటానని భరోసా
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వేసే ప్రతి అడుగూ.. ప్రజా శ్రేయస్సుకు పునాదిగా, వెళ్తున్న ప్రతి బాటా జనక్షేమానికి పరచిన పూలదారిగా... వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది. ప్రతిక్షణం ప్రజాహితమే లక్ష్యమని, కర్షక, కార్మిక, నిరుద్యోగ, ఉద్యోగులకు అండగా ఉండటమే ధ్యేయమని నినదిస్తోంది. శనివారం రూరల్ నియోజకవర్గ పరిధిలో గల కాకినాడ నగరంలో ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా ముగిసింది. భారీ సంఖ్యలో ప్రజలు.. ప్రభుత్వం పట్టించుకోక, పథకాలు అందక, బతుకు భారమై పుట్టెడు కష్టాలతో నాలుగేళ్లుగా పాటు బాధను దిగమింగుకుంటున్న బాధితులకు ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపంలో ఆశాదీపం కన్పించింది.
పల్లె, పట్టణం, నగరమనే తేడా లేకుండా ప్రాంతమేదైనా జగనన్నతో మేమంటూ ముందుకు కదిలాయి. ఆయనను చూసేందుకు చిన్నా పెద్దా తేడా లేకుండా రహదారులపై బారులు తీరారు. బాధలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది సమస్యలు చెప్పుకోగా, మరికొందరు అభిమాన నేతతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. తమ భవిష్యత్ మీరే అంటూ యువత కరచాలనం చేసేందుకు ఆరాట పడ్డారు. ఎవరినీ నిరాశ పరచకుండా అందరితో మాట్లాడి జననేత ముందుకు సాగారు.
పాదయాత్ర సాగిందిలా...
217వ రోజు పాదయాత్ర కాకినాడలోని జేఎన్టీయూ సెంటర్ నుంచి ప్రారంభమై నాగమల్లితోట జంక్షన్, సర్పవరం జంక్షన్, ఏపీఐఐసీ కాలనీ మీదుగా అచ్చంపేట జంక్షన్ వరకు కొనసాగింది. రోజంతా రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకినాడ నగరంలోనే పర్యటన సాగింది. 6.6 కిలోమీటర్ల మేర శనివారం పాదయాత్ర చేశారు. తొలుత ప్రత్యేక హోదాపై లోకసభలో జరిగిన అవిశ్వాస చర్చపై ప్రెస్మీట్ పెట్టి తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించడమే కాకుండా గట్టిగా నిలదీశారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. సాయంత్రం వరకు పాదయాత్ర సాగించిన జగన్ అచ్చంపేటలో జరిగిన మత్స్యకారుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
పార్టీలో చేరికలు
ఏపీఐఐసీ కాలనీ వద్ద ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్ఆర్ఐ దవులూరి దొరబాబుతో పాటు పెద్దాపురానికి చెందిన పలువురు వైఎస్సార్ సీపీలో చేరారు. వారందరికీ వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.
పాదయాత్రలో పార్టీ నేతలు
పార్టీ అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పినిపే విశ్వరూప్, తలశిల రఘురాం, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లాల అ«ధ్యక్షులు కురసాల కన్నబాబు, కవురు శ్రీనివాస్, పీఏసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, సమన్వయకర్తలు ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, పెండెం దొరబాబు, రౌతు సూర్య ప్రకాశరావు, పొన్నాడ సతీష్కుమార్, చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, ఆకుల వీర్రాజు, అనంత ఉదయ భాస్కర్, పర్వత పూర్ణచంద్రప్రసాద్, తోట సుబ్బారావునాయుడు, కొండేటి చిట్టిబాబు, తానేటి వనిత, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్వీజేఆర్ కుమార్, కాకినాడ పార్లమెంటరీ జిల్లా బీసీ మైనారిటీ అధ్యక్షులు అల్లి రాజబాబు, అబ్దుల్ బషీరుద్దీన్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు కురసాల సత్యనారాయణ, కురసాల కళ్యాణ్, లింగం రవి, కాలా లక్ష్మణరావు, మిండగుదిటి మోహన్, కర్రి పాపారాయుడు, మురళీరాజు, కారే శ్రీనివాస్, దవులూరి దొరబాబు, బంధన హరి, కారా శ్రీనివాస్, కర్రి చక్రధర్, సిరిపురపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు