జై 'అన్న'కాపల్లి
మనందరి ప్రభుత్వం రాగానే అనకాపల్లిని జిల్లాను చేస్తానని జగన్ ప్రకటన
అనకాపల్లి సభలో జనసంద్రం
హర్షాతిరేకాలతో మార్మోగిన పట్టణం
ఈ ప్రాంత ప్రజలు కేజీహెచ్కు వెళ్లకుండాఇక్కడే ఆధునాతన వైద్యం అందేలా చూస్తామని వాగ్దానం
సాక్షిప్రతినిధి, విశాఖపట్నం: అనకాపల్లి.. గ్రామీణ జిల్లాకు ఆర్థిక, వాణిజ్య, వ్యాపార కేంద్రం. కానీ మహా విశాఖ నగరం నీడలో నలిగిపోతూ ప్రాభవం కోల్పోతోంది. విద్య, వైద్యంతో సహా అన్నింటికీ విశాఖ వైపు పరుగులు తీయాల్సిన దుస్థితి.. ఈ తరుణంలో ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అనకాపల్లికి విచ్చేసిన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి ఆశల ఊపిరులూదారు. పట్టణ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా బుధవారం జరిగిన సభలో వేలాది మంది ని ఉద్దేశించి ఆయన ప్రసంగించిన తీరు పట్టణ ప్రజల్లో నైతిక స్థైర్యం నింపింది. అభివృద్ధే పట్టని పాలకులను విమర్శించడంతో సరిపెట్టకుండా మనందరి ప్రభుత్వం రాగానే అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామన్న ఆయన ప్రకటన ప్రజల్లో ఉత్తేజాన్నినింపింది. ఏ చిన్నపాటి రోగమొచ్చినా విశాఖ కేజీహెచ్కు పరుగెత్తే దుస్థితి నుంచి ఇక్కడే అన్ని వైద్య ఆరోగ్య సౌకర్యాలు కల్పించేలా తమ ప్రభుత్వం రాగానే కృషి చేస్తామన్న జగన్ భరోసాతో హర్షధ్వానాలు మిన్నంటాయి.
ఆలోచింప చేసిన జగన్ ప్రసంగం
సహజంగా రాజకీయ సభలు.. సమావేశాల్లో విమర్శలు.. ప్రతి విమర్శలకే నేతలు పరిమితమవుతుంటారు. కానీ జననేత జగన్ దానికి భిన్నంగా తమ ప్రభుత్వం రాగానే తామేం చేస్తామో చెబుతూ ప్రస్తుత పాలకల తీరును ఎండగడుతూ వైఎస్ హయాంలో జరిగిన మేలును పక్కా లెక్కలతో సహా వివరించారు. చెరుకు రైతులు, బెల్లం వ్యాపారులు, పాడిరైతుల ఖిల్లా అయిన అనకాపల్లిలో ఆయన తన ప్రసంగంలో ఇవే సమస్యలను ప్రధానంగా చర్చించారు. బెల్లం రైతుకు గరిష్టంగా క్వింటాలుకు రూ.3 వేలు మాత్రమే దక్కుతుంటే అదే క్వింటాలు బెల్లాన్ని సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్లో రూ.8400(కేజీ 84 చొప్పున)కు విక్రయిస్తున్నారని.. ఇంతకంటే దోపిడీ ఇంకేముంటుందని జగన్ ప్రశ్నించారు. దళారులను కట్టడి చేయాల్సిన చంద్రబాబే వారికి నాయకత్వం వíßస్తుంటే రైతులకు గిట్టుబాటు ధర ఎలా వస్తుందని నిలదీశారు. పాడి రైతులనుద్దేశించి ప్రసంగిస్తూ వందశాతం వెన్నతో ఉన్న లీటర్ పాలను‡రూ.26కు రైతుల నుంచి సేకరిస్తున్న కంపెనీలు అదే ధరకు అర లీటర్ పాలే అమ్ముతున్నాయని గుర్తు చేశారు. సహకార రంగంలోని డెయిరీలు మూతపడే పరిస్థితి రాగా విశాఖ డెయిరీ, గుంటూరు జిల్లా సంగం డెయిరీలు మాత్రం టీడీపీ నేతల కుటుంబ సంస్థలుగా మారిపోయాయన్నారు. హెరిటేజ్ కోసంరైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. వందశాతం వెన్నతో ఉన్న పాలకు రూ.26 ముష్టి వేసినట్టు వేస్తే రైతన్నలు ఎలా బతకాలని ప్రశ్నించారు.
నాడు, నేడు బాబు పాలనలో చక్కెర ఫ్యాక్టరీల దురవస్థ.. వైఎస్ హయాంలో వాటికి ప్రాణం
సహకార రంగంలోని చక్కెర కర్మాగారాలన్నీ గతంలో తొమ్మిదేళ్ల చంద్రబాబు హయాంలో నష్టాల్లోకి వెళ్లిపోయాయని, ఆ తర్వాత దివంగత వైఎస్ హయాంలో వాటికి ప్రాణం పోసి లాభాల బాట పట్టించారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ చంద్రబాబు హయాంలో ఫ్యాక్టరీలు నష్టాల ఊబిలో కూరుకుపోయి ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని ఏటికొప్పాక ఫ్యాక్టరీకి కోట్ల రూపాయల రాయితీనిచ్చి వైఎస్ హయాంలో నిలబెడితే ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీ రూ.22 కోట్ల నష్టాలతో మూతపడే పరిస్థితికి చేరుకుందన్నారు. తుమ్మపాల ఫ్యాక్టరీ తొమ్మిదేళ్ల చంద్రబాబు హయాంలో రూ.20కోట్ల నష్టాల్లోకి వెళ్లగా.. దివంగత వైఎస్ అధికారంలోకి రాగానే బకాయిలు తీర్చి..క్రషింగ్ మొదలు పెట్టించారన్నారు.
కానీ ఇప్పుడు మళ్లీ రూ.29కోట్ల నష్టాల్లోకి వెళ్లి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక మూతపడిందన్నారు. జీతాలందక, జీవితాలు గడవక 39 మంది కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారంటే దయనీయ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చున్నారు. చోడవరం ఫ్యాక్టరీ తొమ్మిదేళ్ల బాబు పాలనలో రూ.45కోట్ల నష్టాల్లోకి వెళ్లగా వైఎస్ హయాంలో ఆ నష్టాలను పూడ్చి రూ.45కోట్ల లాభాల్లోకి తీసుకెళ్లారు. మళ్లీ బాబు పాలనలో నేడు చోడవరం షుగర్ ఫ్యాక్టరీ వంద కోట్ల నష్టాల్లో కూరుకు పోయిందన్నారు. తాండవ షుగర్స్ వైఎస్ హయాంలో రూ.5కోట్లు లాభాల్లో ఉంటే. నాలుగున్నరేళ్ల బాబు హయాంలో రూ.40కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందన్నారు.
3 అంబులెన్సులు.. ఒక్కరే డ్రైవర్
అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో సౌకర్యాల లేమి..డాక్టర్ల కొరతను.. మూడు అంబులెన్సులు ఉన్నా డ్రైవర్ ఒక్కరే ఉన్న దుస్థితి వెరసి ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టినట్టు ప్రజలకు వివరించిన ఆయన నాడు వైఎస్ హయాంలో పేదలకు కేటాయించిన ఇళ్లస్థలాలను బలవంతంగా లాక్కొని ప్లాట్లు కడతామని మోసం చేస్తున్న వైనాన్ని ఎండగట్టారు.
జనమే.. జనం: పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం
మీ పిల్లలను నేను చదవిస్తా..మీ కష్టాల్లో తోడుంటా..నాడు నాన్న మీ కోసం అడుగు వేస్తే.. ఆయన బిడ్డగా నేను రెండడుగులు వేస్తా.. జగన్ అనే నేను హామీ ఇస్తున్నా.. అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగంతో అనకాపల్లి వాసులు ఉర్రూతులూగారు. నాగులాపల్లి నుంచి వేలాది మందితో పాదయాత్రగా 4.55 గంటలకు సభాస్థలికి చేరుకున్న వై.ఎస్.జగన్ కోసం మ«ధ్యాçహ్నం 2.30 నుంచే వేలాది ప్రజలు నెహ్రూచౌక్ జంక్షన్లో నిరీక్షించారు. ఎటు చూసినా జనమే కన్పించడంతో జననేత కూడా తన ప్రసంగంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు మోసాలు..నయవంచనపై విమర్శలతో పాటు అనకాపల్లి పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కరెంట్, ఇంటి పన్నుల కోసం ప్రస్తావిస్తూ బాదుడే..బాదుడు, బాదుడే..బాదుడు అంటూ ఆయన చేసిన ప్రసంగం యువతనే కాదు..అన్ని వర్గాలను కేరింతలు కొట్టించింది. అంచనాలకు మించి అనకాపల్లి చరిత్రలోనే గుర్తుండిపోయే విధంగాజనం స్వచ్చం దంగా వెల్లువెత్తడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో సమరోత్సాహం వెల్లివిరిసింది.