వడ్డీ మీద వడ్డీ కట్టాం..
ఈ ప్రభుత్వంలో ఇళ్లు లేవు.. పిల్లలకు ఉద్యోగాలు లేవు
అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోయారు
చంద్రబాబు మమ్మల్ని మోసం చేశారు
వైఎస్ జగన్ వద్ద లంబాడీ మహిళలు, రైతుల ఆవేదన
కోవెలకుంట్ల: ‘ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఓట్లు వేయించుకుని..తరువాత ఏవీ చేయకుండా మమ్మల్ని మోసం చేశాడు’ అని వెల్దుర్తి మండలం ఎల్.బండ తండా లంబాడీ మహిళలు వైఎస్ జగన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప యాత్ర గురువారం వెల్దుర్తి మండలంలో సాగింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన లంబాడీ మహిళలు బుజ్జి, వెంకటమ్మ, నాగమ్మ, తులసి తదితరులు జగన్ను కలసి సమస్యలను విన్నవించారు. పొదుపు రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో అప్పులు చేసి వడ్డీ మీద వడ్డీ కట్టామని వాపోయారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఎలాంటి సమస్యలు ఉండేవి కావని, ఆయన మరణించినప్పటి నుంచి సమస్యలతో సతమతమవుతున్నామని తెలిపారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు లేవు. మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, పిల్లలు ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రావడం లేదని తెలిపారు. పిల్లలకు ఉపకార వేతనాలు అందడం లేదని, కనీసం తమకు ఇళ్లు కూడా లేవని వారు వైఎస్జగన్ దృష్టికి తెచ్చారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
వైఎస్సార్ హయాం.. వ్యవసాయానికి స్వర్ణయుగం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ‘మీనాన్న(వైఎస్ రాజశేఖరరెడ్డి) హయాంలో వ్యవసాయానికి స్వర్ణయుగమని.. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో అన్నదాతలు అప్పుల్లో కూరకుపోయారు’ అని సిద్ధనగట్టుకు చెందిన రైతు అయ్యప్పరెడ్డి వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్త చేశాడు. గురువారం ప్రజా సంకల్పయాత్ర రామళ్లకోట సమీపంలో సాగుతుండగా ఆయన జననేతను కలిసి రైతుల దయనీయ పరిస్థితులపై వివరించారు. హంద్రీ–నీవా రిజర్వాయర్ను పూర్తి చేస్తే పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లోని రైతులకు మూడుకార్ల పంటలకు నీళ్లు అందించవచ్చన్నారు. అయితే సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను ఆదుకోవాలని కోరగా వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.