పిల్లలను చదివించ లేకపోతున్నాం..
వెల్దుర్తి: స్కాలర్ షిప్లు రాక పిల్లలను చదివించుకోవడం కష్టమైందని రామళ్లకోటకు చెందిన పలువురు మహిళలు వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నర్సాపురం క్రాస్ నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కాగానే మహిళలు అధికసంఖ్యలో జననేత వద్దకు వచ్చి సమస్యలు ఏకరువు పెట్టారు. ప్రస్తుతం తమ పిల్లలు హైస్కూల్ నుంచి ఇంటర్, డిగ్రీ చదువులు చదువుతున్నారని, స్కాలర్షిప్లు అందక కూలి చేసుకు బతికే తాము పిల్లలను చదువు మాన్పించాల్సి వస్తోందని పదుల సంఖ్యలో మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని చూసి చలించిన వైఎస్ జగన్ వారితో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను, విద్యార్థులను పట్టించుకోవడం లేదన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తామని భరోసానిచ్చారు. తన భర్త రైతు సుంకయ్య 2015లో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని కలుగొట్ల నాగలక్ష్మమ్మ వాపోయింది. సాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని విన్నవించింది. వైఎస్ జగన్ ఆమెతో మాట్లాడుతూ మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ ఒక్క రైతు ఆత్మహత్యకు పాల్పడకుండా చూస్తానని, ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న వారికి న్యాయం చేస్తానన్నారు.
పేద విద్యార్థులకు సాయం అందించండన్నా..
పత్తికొండ రూరల్: స్కాలర్షిప్లు రావడం లేదు సార్ అని రామళ్లకోటకు చెందిన విద్యార్థి రాజేష్(8వ తరతగతి) వైఎస్ జగన్కు విన్నవించాడు. ఆన్లైన్లో స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసుకుని, బ్యాంకు అకౌంటు ఓపెన్ చేయమని సారోళ్లు చెబితే అన్ని పూర్తి చేశానన్నాడు. కానీ స్కాలర్షిప్లు మాత్రం రావడం లేదని, తమలాంటి పేద విద్యార్థులకు అండగా ఉండండి అన్నా అని వేడుకున్నాడు. పేదవిద్యార్థుల చదువులకు భరోసా కల్పించేలా చూస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.