బ్యాంకు వాళ్లు బంగారం జమ చేసుకున్నారన్నా..
ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి బృందం : ‘అన్నా.. నా పేరు లక్ష్మీదేవి. బ్యాంకులో బంగారాన్ని కుదువపెట్టి రూ.50 వేలు తీసుకున్నా. రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోవడంతో బ్యాంకు వాళ్లు బంగారాన్ని జమ చేసుకున్నారు.’
♦ ‘అన్నా.. నా పేరు వెంకటస్వామి. లక్షా పదిహేను వేల రూపాయల పంట రుణం తీసుకున్నా.. చంద్రబాబు లక్షన్నర రూపాయలు రుణ మాఫీ చేస్తానన్నారు. నాకు మాత్రం రూపాయి కూడా మాఫీ కాలేదు.’
♦ ‘అన్నా.. నా పేరు గోపాల్. మాది వెల్దుర్తి మండలం గోవర్ధనగిరి. 2014 ముందు రూ.25 వేలు బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నా. నాకు మాఫీ అయ్యింది కేవలం రూ.1100 మాత్రమే. వడ్డీలు పెరిగి అది ఇప్పుడు రూ.35 వేలు అయ్యింది. రుణమాఫీ ఒట్టి బోగస్.’ ఇలా వీరే కాకుండా పలువురు రైతులు, డ్వాక్రా అక్కాచెల్లెమ్మలు వైఎస్ జగన్ ఎదుట తమ కష్టాలు ఏకరువు పెట్టారు.
♦ అక్షయ గోల్డ్ సంస్థ చేసిన మోసం కారణంగా ఏజెంట్లు, డిపాజిటర్లు ఇబ్బందులు పడాల్సి వస్తోందని అక్షయ గోల్డ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్బాబు, నాయకులు నారాయణ, నాగేశ్వరరావు, రహంతుల్లా తదితరులు జగన్ ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు.
♦ పోలీసు శాఖలో విశిష్ట సేవలందిస్తున్న తమ పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని కర్నూలు జిల్లా హోంగార్డుల సంఘం ప్రతినిధులు వెంకటేశ్వర్లు, నారాయణస్వామి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.