నమ్మి వచ్చినందుకు నయవంచన
యువతి ఆత్మహత్య పరారైన ప్రియుడు
చిత్తూరు, మదనపల్లె క్రైం : ఆమె ప్రియుడి కోసం కట్టుకున్న భర్త, కన్నపేగులను వదిలేసింది. ఇల్లు వదిలి ప్రియుడి వెంట వచ్చేసింది. ప్రేమగా చూడాల్సిన ప్రియుడు కూలి పనులకు పంపించడంతో మనోవేదన చెందింది. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పుంగనూరు మండలం ఆరేడిగుంట పంచాయతీ కురవపల్లెకు చెందిన రవి, ఎన్.లక్ష్మి (25) దంపతులకు ఇద్దరు పిల్లలు ఈశ్వర్, విష్ణు ఉన్నారు. గతంలో లక్ష్మి అదే గ్రామానికి చెందిన కె.చంద్రశేఖర్ను ప్రేమించింది.
ఆ విషయం ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచింది. ఏమి జరిగిందో కాని 20 రోజుల క్రితం భర్త, బిడ్డలను వదిలిపెట్టి ప్రియుడి వెంట వెళ్లిపోయింది. మదనపల్లె రామిరెడ్డి లేఔట్లో అద్దె ఇంటిలో కాపురం పెట్టారు. ప్రియుడు ఆమెను టమాట మార్కెట్ యార్డులో కూలి పనులకు వెళ్లాలని సూచించాడు. నమ్మి వచ్చినందుకు నయవంచన చేయడమే కాకుండా, కూలి పనులకు పంపిస్తావా అంటూ నిలదీసింది. శుక్రవారం ఇద్దరూ గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంటిలో తాడుతో ఉరివేసుకుంది. అతను ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. అతను అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. వన్టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.