సంక్షేమ పథకాలు జననేతకే సాధ్యం
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
తూర్పుగోదావరి ,అంబాజీపేట: బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసే సత్తా ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి మాత్రమే సాధ్యమవుతుందని పలువురు నాయకులు అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రౌతులపూడి మండలం పారుపాక క్యాంపు కార్యాలయం వద్ద పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో పాయకరావుపేటకు చెందిన కేన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూటూరి శ్రీనివాసరావుతో పాటు పలువురు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి జగన్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలు చేసిన చంద్రబాబు నాలుగేళ్ల పాలనంతా అవినీతిమయంగా మారిందన్నారు.
చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లు దొరికినకాడికి దోచుకోవడానికే తప్ప రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించలేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీకి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్సార్ సీపీ రూపొందించిన నవరత్నాల పథకాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా ఉన్నాయన్నారు. జగన్ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని విజయపథంలో నడిపించడంతో పాటు జగన్ను సీఎం చేసేందుకు కృషి చేస్తామన్నారు.