నెల రోజులు సమయమిస్తాం
పోలవరం కాంక్రీటు పనులపై గడ్కరీ
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టులో కాంక్రీటు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నెల రోజుల్లో పురోగతి చూపాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. పనుల్లో పురోగతి చూపకపోతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన కొత్త టెండర్ల ద్వాకా కాంక్రీటు పనులను కొత్త కాంట్రక్టర్ను అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలో బుధవారం రాత్రి పోలవరం ప్రాజెక్టుపై గడ్కరీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు.
పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా నిధులివ్వడం, తాజాగా పిలిచిన టెండర్లు, కాంట్రాక్ట్కు అదనపు బిల్లులు చెల్లించడం, భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీకి నిధులు ఇవ్వడం తదితర రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను ప్రస్తావించారు. ఈ సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్, రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, రాష్ట్ర జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం గడ్కరీ మీడియాతో మాట్లాడారు.