స్కూల్ కమిషనర్ దృష్టికి ‘తరగతిగదిలో నీటి దందా’
విజయనగరంఅర్బన్/ విజయనగరం పూల్బాగ్: పట్టణంలోని 23వ వార్డు పరిధిలోని నాగోజీపేట మున్సిపల్ పాఠశాల తరగతి గదిని అక్రమించుకొని నిర్వహిస్తున్న నీటి దందాను తొలగించాలని కోరుతూ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ సోమవారం జిల్లాకు వచ్చిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణికి వినతిపత్రం అందించారు. బడిని టీడీపీ కౌన్సిలర్ భర్త ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్న విషయంపై పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ఆధారాలతో సహా కమిషనర్కు వివరించారు.దినికి స్పందించిన కమిషన్ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో ఉన్న 2,817 స్కూళ్లలో మౌలిక సదుపాయాల కొరత ఉందని, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని బాబ్జీ కమిషనర్ను కోరారు. ముఖ్యంగా మరుగుదొడ్లు ఉండి వాటిని శుభ్రపరిచే వారు లేకపోతే ఎలా అని ఆయన కమిషనర్ను ప్రశ్నించారు. ప్రహరీలు లేవని, పుస్తకాలు లేవని తదితర విషయాలను ఆయన సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లారు.