మా కొలువుల్ని క్రమబద్ధీకరించాలి
జగన్కు పంచాయతీ కాంట్రాక్టు కార్మికుల వినతి
తూర్పుగోదావరి ,అంబాజీపేట: పంచాయతీల్లో కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్న తమ ఉద్యోగాల్ని క్రమబద్ధీకరించాలని పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికులు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అచ్చంపేట వద్ద ఆయపకు సామర్లకోట మండల పంచాయతీ వర్కర్ల అసోసియేషన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 35 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ట్యాంకు వా చరు, ఎవెన్యూ వాచరు, ఎలక్ట్రీషి యన్, స్వీపర్స్, అటెండర్స్, పార్ట్ టైం జూనియర్ బిల్లు కలెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారన్నారు.
చాలీచాలని జీతాలతో కుటుంబాల్ని పోషించుకుంటున్నామని, 30 ఏళ్ళ నుంచి రెగ్యులర్ చేస్తారని ఎదురు చూస్తున్నామని వాపోయారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అప్పట్లో జీవో నెం.39 ప్రకా రం పంచాయతీ కాంట్రాక్టు కార్మికులను రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి మాదిరిగా రెగ్యులర్ చేస్తామని చెప్పారని, మహానేత హఠాన్మరణం తమ పాలిట దురదృష్టమని ఆవేదన చెందారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తమను రెగ్యులర్ చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వై.శివశంకర్, ఎం.సుబ్రహ్మణ్యం తదితరులు జగన్కు విజ్ఞప్తి చేశారు.
సంబంధిత వార్తలు