‘గమ్‌ సొసైటీ’ ఆస్తులు ఎస్తేరు రాణికే

KA Paul

ఉత్తర్వులు జారీ చేసిన ఆర్డీవో

11న కేఏ పాల్‌ నుంచి స్వాధీన ప్రక్రియకు తహశీల్దార్‌ నోటీసులు  

సాక్షి, విశాఖపట్నం: క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్‌ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న గమ్‌ సొసైటీకి చెందిన ఆస్తులను ఆయన సోదరుడు దివంగత కే.డేవిడ్‌రాజు భార్య ఎస్తేరు రాణికి అప్పగించాలని విశాఖ అర్బన్‌ తహశీల్దార్‌ నాగభూషణం నోటీసులు జారీ చేశారు. ఆర్డీవో సూచన మేరకు ఆయన ఇరు పార్టీలకు నోటీసులు జారీ చేశారు. గమ్‌ సొసైటీ ఆస్తులపై సోదరులైన కేఏ పాల్, కె.డేవిడ్‌రాజుల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

విశాఖ ఆశీల్‌మెట్టలోని హోటల్‌ మేఘాలయ పక్కనే గమ్‌ ఆడిటోరియంతోపాటు దొండపర్తిలో కూడా ఈ సొసైటీకి రూ. వందల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఈ వివాదం నేపథ్యంలోనే డేవిడ్‌రాజు హత్యకు గురికావడంతో ఆయన భార్య, కుమారులు పాల్‌పై న్యాయపోరాటం చేస్తున్నారు. కేఏ పాల్‌కే ఈ ఆస్తులు చెందుతాయని, వాటిని ఆయనకు అప్పగించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు గమ్‌ సొసైటీ ఆస్తులను ఈ ఏడాది మే 16వ తేదీన కేఏ పాల్‌కు అప్పగించారు. అయితే దీన్ని సవాల్‌ చేస్తూ డేవిడ్‌రాజు భార్య ఎస్తేరు రాణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేఏ పాల్‌ ఆధీనంలో ఉన్న ఆస్తులను అర్బన్‌ ఎమ్మార్వోకు స్వాధీనం చేయాలని, వాటిని ఎస్తేరురాణికి అప్పగించాల్సి ఉందంటూ ఆర్డీవో తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 10 గంటలకు ఆయా ఆస్తులను అర్బన్‌ ఎమ్మార్వోకు అప్పగించాలని నోటీసులు జారీ చేశారు. ఒకవేళ రాకుంటే నిబంధనల మేరకు వాటిని స్వాధీనం చేసుకుని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్తేరు రాణికి అప్పగిస్తామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top